గిరిజన గ్రామాల అభివృద్ధికి చర్యలు | Sakshi
Sakshi News home page

గిరిజన గ్రామాల అభివృద్ధికి చర్యలు

Published Sun, Apr 9 2017 10:54 PM

గిరిజన గ్రామాల అభివృద్ధికి చర్యలు

ఓఎస్‌డీ రవిశంకర్‌రెడ్డి 
రంపచోడవరం : ఏజెన్సీలో గిరిజనులకు పోలీస్‌ శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నట్టు ఓఎస్‌డీ వై.రవిశంకర్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఆదివారం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గిరిజనులకు వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 
కమ్యూనికేషన్‌ వ్యవస్థను మెరుగుపరుస్తాం 
ఏజెన్సీలో కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత విస్తృతం చేసేందుకు కృషిచేస్తున్నట్టు ఓఎస్‌డీ రవిశంకర్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే బోదులూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటైనట్టు తెలిపారు. ఏజెన్సీలో మరికొన్ని చోట్ల టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల పాతకోట సమీపంలోని గ్రామాల నుంచి గిరిజన యువతను ఉపాధి అవకాశాలపై కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు తీసుకువచ్చినట్టు తెలిపారు. పాతకోట – మంగంపాడు రోడ్డు నిర్మాణం పూర్తయితే అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పడుతుందన్నారు. ఐఏపీలో అనేక రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇచ్చినట్టు తెలిపారు. తూర్పు ఏజెన్సీలో మావోల ప్రభావం లేదన్నారు. విలీన మండలాల్లో మావోల కార్యకలాపాలు ప్రభావం కొంత ఉంటుందన్నారు. మావోలకు సహరించే వారి కదలికలపై ఎప్పుడు నిఘా ఉంటుందన్నారు. గిరిజనులు మావోలక సహకరించడం లేదన్నారు. సీఐలు ఎం.గీతారామకృష్ణ, ముక్తేశ్వరరావు, ఎస్సైలు జె.విజయబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement