Sakshi News home page

నల్లవాగుకు ఖరీఫ్‌ కళ..

Published Fri, Aug 26 2016 3:32 PM

నల్లవాగుకు ఖరీఫ్‌ కళ.. - Sakshi

రైతన్నకు వరప్రదాయిని మధ్య తరహా ప్రాజెక్టు
కలే్హర్‌ :
నల్లవాగు ఆయకట్టు భూములకు ‘ఖరీఫ్‌’ కళ వచ్చింది మెదక్, నిజామాబాద్‌ జిల్లాల రైతులకు నల్లవాడు ప్రాజెక్టు వరప్రదాయిని. జూలై, అగస్టు నెలల్లో నల్లవాగు ఎగువభాగంలోని కర్ణాటక, కంగ్టి మండలంలో అడపాదడపగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగుపై నుంచి నీళ్లు పారుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1493 ఫీట్లు. పూర్తి నీటి నిల్వ 776.13 ఎంసీఎఫ్‌టీలు, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 1491.5 ఫీట్లుగా ఉంది. కుడి కాల్వ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్‌(కె), కష్ణాపూర్, ఇందిరానగర్, కలే్హర్‌ వరకు 4,100 ఎకరాలు ఆయకట్టు ఉంది.

ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్‌గాం, నిజామాబాద్‌ జిల్లా మార్దండ, తిమ్మనగర్‌ గ్రామాల్లో 1,230 ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఇటివల ఖేడ్‌ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు సాగు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు కింద రైతులు సోయాబీ¯ŒS, మొక్కజొన్న పంటలు వేశారు. కొందరు రైతులు వరి సాగు చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటలు సాగుకు నోచుకుంటున్నాయి.
ప్రత్యామ్నాయంగా కాల్వల మరమ్మతు పనులు
కలే్హర్‌ మండలంలోని సుల్తానాబాద్‌ వద్ద 1967లో రూ. 98లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడి, నీటి పారుదల శాఖా మంత్రి శీలం సిద్ధారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. నల్లవాగు ప్రాజెక్టు సాగు నీటి విడుదలకు ముందు శిథిలం కావడంతో వాటిని  బాగు చేసి ఆయకట్టు అంతట సాగు నీరందించాలని రైతులు ప్రభుత్వన్ని కోరుతున్నారు. ఇటీవలే రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో పర్యటించి నల్లవాగు ప్రాజెక్టు రూపురేఖలు మారుస్తామని ప్రకటించారు.

ప్రాజెక్టును పూర్తిగా అధునికరిస్తామని మంత్రి హరీశ్‌రావు రైతన్నలకు భరోసా కల్పించారు. దీంతో ఆయకట్టు కింది రైతుల్లో ‘ఆశలు’ చిగురించాయి. ఆయకట్టుకు సక్రమంగా సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కృషి మేరకు ప్రభుత్వం రూ. 13 లక్షలు మంజూరు చేసింది. ప్రత్యామ్నాయంగా కాల్వల్లో పేరుకున్న పూడిక, పిచ్చి మొక్కలు తొలగించారు. కాల్వలకు జలకళ సంతరించుకుంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement

What’s your opinion

Advertisement