పోలీసులు నన్ను చితకబాదారు! | Sakshi
Sakshi News home page

పోలీసులు నన్ను చితకబాదారు!

Published Thu, Jul 23 2015 9:47 PM

పోలీసులు నన్ను చితకబాదారు! - Sakshi

గుంతకల్లు (అనంతపురం జిల్లా): గుంతకల్లు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కొనకొండ్ల గ్రామానికి చెందిన ఓ మహిళ ఎక్సైజ్ పోలీసులు తనను చితకబాదని ఆరోపించింది. గురువారం సాయంత్రం బాధితురాలు భాగ్యమ్మ వైద్యపరీక్షల నిమిత్తం గుంతకల్లు పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. అనంతపురం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో బుధవారం కొనకొండ్ల గ్రామంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా విక్రయిస్తున్నారన్న నెపంతో లక్ష్మిదేవి, భాగ్యమ్మలతోపాటు మరో ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ బెయిల్ అనంతరం మహిళలను రిలీజ్ చేయాల్సి ఉండగా భాగ్యమ్మ అనే మహిళ నుంచి డబ్బులు డిమాండ్ చేశారని, తన వద్ద డబ్బులు లేవని భాగ్యమ్మ చెప్పగా కోపోద్రిక్తులైన సీఐ టకీబాష నానా దుర్భాషలాడుతూ లాఠీలతో దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.

మేము సారా విక్రయించడం లేదని కూలీ పని చేసుకుంటూ జీవిస్తుంటామని చెబుతున్నా పోలీసులు వినిపించుకోలేదన్నారు. తన భర్త (రామాంజినేయులు) ఇంట్లో లేరని ఆయన వచ్చిన తరువాత పోలీసుస్టేషన్‌కు వస్తామని చెప్పినా పోలీసులు బలవంతంగా లాక్కువచ్చారని బాధిత మహిళ భాగ్యమ్మ వాపోయింది. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ టకీభాషను వివరణ కోరగా తాము భాగ్యమ్మ పై చేయి చేసుకోలేదని, ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు. భాగ్యమ్మను ఉదయం వైద్యపరీక్షల అనంతరం లాయర్ సమక్షంలో ఇంటి పంపమని, కేవలం ఆమె బ్లాక్‌మేల్ చేస్తుందని సీఐ చెప్పారు.

Advertisement
Advertisement