ప్రత్తిపాటి కుయుక్తులను అడ్డుకుంటాం | Sakshi
Sakshi News home page

ప్రత్తిపాటి కుయుక్తులను అడ్డుకుంటాం

Published Tue, Jan 24 2017 11:10 PM

We will protest the Minister Prathipati's things

* దళితుల భూముల్లో ఒక్క సెంటు తీసుకున్నా తీవ్ర పరిణామాలు
* వైఎస్సార్‌సీపీ నాయకుల హెచ్చరిక  
* యడవల్లి భూముల పరిశీలన
* అండగా ఉంటామని దళితరైతులకు భరోసా
 
చిలకలూరిపేట: యడవల్లి దళిత రైతుల భూములను కబ్జా చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేస్తున్న కుయుక్తులను అడ్డుకుంటామని వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబు చెప్పారు. చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని దళితులకు చెందిన 416 ఎకరాల పంట భూములను పార్టీ ఎస్సీ విభాగంతో పాటు వివిధ విభాగాల నాయకులు మంగళవారం సందర్శించారు. దళిత రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ... అధికారం చేపట్టిన నాటి నుంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న మంత్రి దళితుల భూములపై కన్నేశారని, వారిని భూముల నుంచి వెళ్లగొట్టేందుకు అధికారులతో తప్పుడు నివేదికలు రూపొందించారని ఆరోపించారు. మంత్రి ప్రాపకం కోసం తప్పుడు నివేదికలు రూపొందించిన తహసీల్దార్‌తో పాటు ఇతర అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
గ్రానైట్‌ నిక్షేపాలు కాజేసేందుకే...
ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే పెదమాదిగనై రుణం తీర్చుకుంటానని చెప్పిన   ముఖ్యమంత్రి చంద్రబాబు  మోసం చేస్తే, ఆయన మంత్రి వర్గంలోని ప్రత్తిపాటి పుల్లారావు దళితుల భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలే దేవరాజు విమర్శించారు.    భూముల్లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్‌ నిక్షేపాలు కాజేసేందుకు పచ్చని పంట పొలాలను ధ్వంసం చేసి వారిని రోడ్డు పాలు చేసేందుకు మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 416 ఎకరాల భూమిలో ఒక్క సెంటు తీసుకున్నా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. 
 
ప్రజాఉద్యమం ద్వారా తేల్చుకుంటాం..
దళితుల భూములు కాజేసేందుకు భూబకాసురుడి అవతారం ఎత్తిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంగతి ప్రజా ఉద్యమం ద్వారా తేల్చుకుంటామని  పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అత్తోట జోసెఫ్‌  హెచ్చరించారు. వివిధ రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో ఉద్యమిస్తామని, దళితులకు అన్యాయం జరగకుండా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ భూకుంభకోణం వ్యవహారంలో సీబీఐ విచారణ నిర్వహించి మంత్రితో పాటు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలుచేపట్టాలని కోరారు. అనంతరం దళితుల భూములకు నీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని నాయకులు పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వనమా బాలవజ్రబాబు(డైమండ్‌ బాబు), మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ మాబు, సేవాదళ్‌ జిల్లా అ«ధ్యక్షుడు కొత్త చిన్నపరెడ్డి, గుంటూరురూరల్‌ మండలం జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏటుకూరి విజయసారధి, ఎస్సీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జంగా జయరాజు, పార్టీ జిల్లా కార్యదర్శి చిలకా సుబ్బారావు, బండారు శ్రీనివాసరావు, కాకుమాను జయప్రకాశ్, పచ్చల ఆనందరావు, చిలకలూరిపేట మండల పార్టీ అధ్యక్షుడు చాపలమడుగు గోవర్దన్, యువజన విభాగం  అధ్యక్షుడు వేజర్ల కోటేశ్వరరావు, యడవల్లి వీకర్స్‌ సెక్షన్‌ ల్యాండ్‌ కాలనైజేషన్‌ సొసైటీ ఉపా«ధ్యక్షుడు తాళ్లూరి వెంకట్రావు , నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎస్సీ,ఎస్టీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ జిల్లా అధ్యక్షుడు రాయిపూడి మాణిక్యరావు, మాదిగ సంక్షేమ పోరాట సభ రాష్ట్ర అధ్యక్షుడు తంగిరాల ఇర్మియా మాదిగ  తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement