- భర్త, అత్తపై కేసు నమోదు
కొత్తపల్లి :
ప్రేమించానంటూ వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక.. వరకట్నం తేవాలని వేధించడం ప్రారంభించాడు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో ఆమె ఉరి వేసుకుని చనిపోయింది... ఈ సంఘటన మండలంలోని వాకతిప్పలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం విరవాడ గ్రామానికి చెందిన క్రాంతిరేఖ (22) ఉప్పాడ బీచ్ రోడ్డు సెంటర్లో ఉన్న మీ సేవ కేంద్రంలో పనిచేసేది. ఆమెతో వాకతిప్పకు చెందిన ఆటో డ్రైవర్ పసుపులేటి ఈశ్వరరావు పరిచయం ఏర్పడింది. ప్రేమించుకున్న వారిద్దరూ.. పెద్దల అంగీకారంతో గతేడాది జూన్ 10న అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వరకట్నం కోసం ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె ఎక్కువగా ఇంటింటిలోనే ఉండేది. శనివారం ఆమెను అత్తగారి ఇంటికి తీసుకువెళ్లారు. బుధవారం రాత్రి ఆమె ఉరివేసుకుని మృతి చెందింది. దీనిపై గురువారం ఉదయం ఆమె తల్లి కృపావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చైతన్యకుమార్ సంఘటన స్థలాన్ని మృతదేహాన్ని పరిశీలించి భర్త ఈశ్వరరావు, అత్త రామలక్ష్మిలపై కేసు నమోదు చేశారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న కూతురుని విగతజీవిగా చూడాల్సి వచ్చిందంటూ ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.