పరిశోధకుల పరీక్ష ఏఎస్‌ఆర్‌బీ-ఏఆర్‌ఎస్ | Sakshi
Sakshi News home page

పరిశోధకుల పరీక్ష ఏఎస్‌ఆర్‌బీ-ఏఆర్‌ఎస్

Published Thu, Aug 21 2014 2:41 AM

పరిశోధకుల పరీక్ష ఏఎస్‌ఆర్‌బీ-ఏఆర్‌ఎస్

దేశ ఆర్థిక, సామాజిక ప్రగతిలో వ్యవసాయ రంగానిది కీలక పాత్ర.. సమృద్ధిగా పంటలు పండితేనే అందరికీ ఆహార భద్రత సాధ్యమవుతుంది.. ఇందుకోసం రైతులకు మెరుగైన వంగడాలు, సాగుపద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం.. తదనుగుణంగా సౌకర్యాలను రైతుల దరి చేర్చడానికి పరిశోధనలు అవసరం.. ఈ పరిశోధనలను చేపట్టడానికి అవసరమైన శాస్త్రవేత్తలను రిక్రూట్ చేసుకోవడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్)కు చెందిన ఆగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ).. అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ (ఏఆర్‌ఎస్) ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. 2014 సంవత్సరానికి ఏఆర్‌ఎస్‌తోపాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిని ప్రారంభించడానికి దోహదం చేసే ఏఎస్‌ఆర్‌బీ-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)కు సంయుక్తంగా నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..
 
 ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఏఎస్‌ఆర్‌బీ 37 విభాగాల్లోని శాస్త్రవేత్తల పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందుకోసం రెండు దశల ఎంపిక విధానాన్ని అనుసరిస్తుంది. అవి.. రాత పరీక్ష, వైవా వాయిస్. రాత పరీక్షను ప్రిలిమినరీ, మెయిన్ అనే రెండు దశల్లో నిర్వహిస్తారు. వివరాలు..
 
 ఆబ్జెక్టివ్‌గా:
 రాత పరీక్షలో మొదటి దశ.. ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. వీటికి 120 నిమిషాల్లో (2 గంటలు) సమాధానాలు గుర్తించాలి. ఈ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. కాకపోతే ప్రిలిమినరీలో నిర్దేశించిన అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే మెయిన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా 1:15 నిష్పత్తిలో మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈక్రమంలో కేటగీల వారీగా అభ్యర్థులు సాధించాల్సిన కనీస అర్హత మార్కులు..
 
 జనరల్ అభ్యర్థులు    45 శాతం
 ఓబీసీ (నాన్-క్రీమీలేయర్)    40 శాతం
 ఎస్సీ/ఎస్టీ/పీడీ    35 శాతం
 
 డిస్క్రిప్టివ్‌గా:
 రెండో దశలో ఉండే మెయిన్ పరీక్షను డిస్క్రిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. దీనికి 240 మార్కులు కేటాయించారు. 180 నిమిషాల్లో (3 గంటలు) సమాధానాలను ఇంగ్లిష్ లేదా హిందీ భాషలో మాత్రమే రాయాలి. ప్రశ్నపత్రాన్ని పార్ట్-ఎ,బి,సి అనే మూడు విభాగాలుగా విభజించారు. పార్ట్-ఎలో 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. వీటికి 10 పదాలకు మించకుండా జవాబు రాయాల్సి ఉంటుంది. పార్ట్-బిలో 20 ప్రశ్నలు ఇస్తారు. వీటికి ఒక్కో ప్రశ్నకు 5 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించారు. వీటికి ఒకటి/రెండు పేరాగ్రాఫ్‌లు లేదా గ్రాఫికల్ వివరణ ద్వారా సమాధానాలివ్వాలి. పార్ట్-సిలో 6 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు చొప్పున 60 మార్కులకు ఈ విభాగం ఉంటుంది. ఈ పరీక్ష ఆధారంగా 1:15 నిష్పత్తిలో వైవా-వాయిస్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 
 వైవా-వాయిస్:
 ఎంపిక క్రమంలో చివరగా వైవా-వాయిస్ ఉంటుంది. ఈ విభాగానికి 60 మార్కులు కేటాయించారు. ఇందులో సంబంధిత సర్వీస్‌కు అభ్యర్థి సరిపోతాడా? లేదా? అనే అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. అంతేకాకుండా సమకాలీన అంశాలు, అభ్యర్థి స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. మేధో సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం, చురుకుదనం, సామాజిక దృక్పథం వంటి లక్షణాలను పరీక్షిస్తారు.
 
 పరిమితంగానే:
 సివిల్స్ మాదిరిగానే ఈ పరీక్షకు కూడా హాజరు విషయంలో పరిమితిని నిర్దేశించారు. ఆ మేరకు అభ్యర్థులకు నాలుగు సార్లు మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతిస్తారు (ఐసీఏఆర్ ఇన్ సర్వీస్ అభ్యర్థులతో కలిపి). ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు హాజరు విషయంలో ఎటువంటి పరిమితి లేదు.
 
 నియామకం:
 మెయిన్, వైవా-వాయిస్‌లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందిస్తారు. వీరికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్)లో శాస్త్రవేత్తలు (సైంటిస్ట్స్)గా నియామకాన్ని ఖరారు చేస్తారు. రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో ఉంటారు. ఈ సమయంలో రూ. 15,600-39,100 (గ్రేడ్ పే-రూ. 6,000) వేతనం లభిస్తుంది. నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు. అంతేకాకుండా నిర్దేశిత కాలం పని చేస్తామని సర్వీస్ బాండ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
 
 నోటిఫికేషన్ సమాచారం:
 అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ
 (డిసెంబర్ 28, 2014 నాటికి).
 వయసు: 21-32 ఏళ్లు (ఆగస్టు 1, 2014 నాటికి)
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 8, 2014.
 ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ. 500(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపునిచ్చారు). ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

 ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలు:
 సెప్టెంబర్ 22-28, 2014 వరకు.
 మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 28, 2014
 వెబ్‌సైట్: www.asrb.org.in, www.icar.org.in
 
 ఏఎస్‌ఆర్‌బీ-నెట్
 (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)
 
 యూజీసీ-నెట్ తరహాలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక వృత్తిని ప్రారంభించాలనుకునే అభ్యర్థుల కోసం అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ) నిర్వహించే పరీక్ష.. ఏఎస్‌ఆర్‌బీ-నెట్. వ్యవసాయ, దాని అనుబంధ విభాగాల్లో కలిపి మొత్తం 55 విభాగాల్లో ఆన్‌లైన్ విధానంలో ఏఎస్‌ఆర్‌బీ-నెట్ జరుగుతుంది.
 
 పరీక్షా విధానం:
 ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌ను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో 150 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు కేటాయించారు. రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా మాస్టర్ డిగ్రీ స్థాయిలో ప్రశ్నలను అడుగుతారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
 
 ఐదు అవకాశాలు:
 ప్రతి అభ్యర్థికి ఏఎస్‌ఆర్‌బీ-నెట్ రాసేందుకు ఐదు అవకాశాలు ఉంటాయి (ఐసీఏఆర్ ఇన్ సర్వీస్ అభ్యర్థులతో కలిపి). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు హాజరు విషయమంలో ఎటువంటి పరిమితి లేదు.
 
 అర్హత మార్కులు:
 యూజీసీ-నెట్ మాదిరిగానే ఇందులో కూడా నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను మాత్రమే తుది జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈక్రమంలో కేటగీల వారీగా అభ్యర్థులు సాధించాల్సిన కనీస అర్హత మార్కులు..
 
 జనరల్ అభ్యర్థులు    50 శాతం
 ఓబీసీ (నాన్-క్రీమీలేయర్)    45 శాతం
 ఎస్సీ/ఎస్టీ/పీడీ    35 శాతం
 
 ప్రయోజనాలు:
 రాష్ట్ర లేదా జాతీయస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఏఎస్‌ఆర్‌బీ-నెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏఎస్‌ఆర్‌బీ సర్టిఫికెట్లను కూడా జారీ చేస్తుంది. తద్వారా అగ్రికల్చర్ యూనివర్సిటీలలోని అధ్యాపక పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం సద రు అభ్యర్థులకు మాత్రమే ఉంటుంది.
 
 నోటిఫికేషన్ సమాచారం:
 అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ
 (డిసెంబర్ 28, 2014 నాటికి).
 వయసు: 21 ఏళ్లు (ఆగస్టు 1, 2014 నాటికి).
 గరిష్ట వయోపరిమితి లేదు.
 ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ. 1,000
 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.250, మహిళా అభ్యర్థులకు మినహాయింపునిచ్చారు).
 ఫీజును నిర్దేశించిన విధంగా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 రాత పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 22-28 వరకు.
 వెబ్‌సైట్: www.asrb.org.in, www.icar.org.in
 
 ఏఆర్‌ఎస్ పరీక్షలో ప్రిలిమినరీలో.. బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సుల్లోని ప్రాథమిక అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. మెయిన్‌లో ఇచ్చిన సమాధాన పత్రంలో మాత్రమే జవాబులను రాయాలి. ఇందులోని పార్ట్-ఎలో ఉండే 40 ప్రశ్నలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్ తరహా ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వీటికి సమాధానాలు రాయడం సులభమే. అంతేకాకుండా ఈ విభాగానికి 80 మార్కులు కేటాయించారు. కాబట్టి పార్ట్-ఎ మంచి స్కోరింగ్‌కు అవకాశం కల్పిస్తుంది.  మెయిన్‌లో పార్ట్-బిలో ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. దాంతో పార్ట్-సి కోసం సమయం చిక్కదు.
 
  కాబట్టి పార్ట్-బిలో ఫ్లోచార్ట్, గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ద్వారా జవాబులు రాయడం సముచితం. తద్వారా సమయం ఆదా అవుతుంది. పార్ట్-సిలో సమాధానాలను విస్తృత అవగాహనతో రాయాల్సి ఉంటుంది. ఏఆర్‌ఎస్ కోసం బీఎస్సీ, ఎంఎస్సీలోని ప్రాథమిక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. చాలా మంది ఈ అంశాన్ని విస్మరిస్తారు. ప్రాథమిక అంశాలు పూర్తయిన తర్వాత మిగతా అంశాలను ప్రిపేర్ కావడం మంచిది. అంతేకాకుండా ఒక్కో అంశానికి 30-40 పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. కాబట్టి చదివేటప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఉత్తమం.  గతేడాది నెట్-ఏఆర్‌ఎస్ పరీక్ష వేర్వేరుగా నిర్వహించారు. నెట్‌లో వచ్చిన ప్రశ్నల పరిధి విస్తృతంగా ఉంది. కాబట్టి నెట్ కోసం సబ్జెక్ట్‌ను లోతుగా చదవాలి. -రోణంకి స్వర్ణ (ఐఏఆర్‌ఐ రీసెర్చ్ స్కాలర్),
 ఏఆర్‌ఎస్-2013 విజేత.
 

Advertisement
Advertisement