Sakshi News home page

పవన్ 'అనంత' సభకు పరిటాల సునీత డుమ్మా

Published Mon, May 5 2014 5:27 PM

పవన్ 'అనంత' సభకు పరిటాల సునీత డుమ్మా - Sakshi

తెలుగుదేశం పార్టీ దివంగత నాయకుడు పరిటాల రవితో పవన్ కల్యాణ్కు గతంలో విభేదాలున్నాయా? పరిటాల చేతిలో పవన్కు ఘోర పరాభవం జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఎన్నోసార్లు బాహాటంగా విమర్శించారు కూడా. పవన్ గతంలో ఓ సారి దీన్ని ఖండించినా పరిటాల మాత్రం స్పందించలేదు. తాజాగా పవన్ అనంతపురంలో పాల్గొన్న ఎన్నికల ప్రచార సభకు రవి సతీమణి పరిటాల సునీత దూరంగా ఉన్నారు. దీంతో పరిటాల కుటుంబానికి, పవన్కు పడదన్న సంగతి నిజమేనని అనంతపురం వాసులు చర్చించుకుంటున్నారు.

టీడీపీ, బీజేపీ కూటమి తరపున ప్రచారం చేస్తున్న జనసేన అధినేత సోమవారం అనంతపురం వచ్చారు. ఈ సభలో అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులు ప్రభాకర చౌదరి, జేసీ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. పరిటాల సునీత రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. జిల్లా కేంద్రం అనంతపురానికి కూతవేటు దూరంలోనే రాప్తాడు నియోజకవర్గం ఉంటుంది. అయినా పరిటాల సునీత మాత్రం పవన్ సభకు రాలేదు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎన్నాళ్లుగానో అండగా ఉన్న పరిటాల కుటుంబం ఇప్పుడు దూరంగా ఉండటంపై ఇటు టీడీపీ, అటు పవన్ అభిమానులు డైలమాలో పడ్డారు. పవన్ కూడా టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు తప్ప ఎక్కడా పరిటాల సునీత పేరు కూడా ప్రస్తావించిన పాపాన పోలేదు.  దీంతో ఏదో విషయం ఉందని సభకు వచ్చిన వారే మాట్లాడుకోవడం కనిపించింది.

Advertisement

What’s your opinion

Advertisement