హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్లా తాను మాట తప్పలేదని...ఆయనలా దౌర్బాగ్యపు మనిషిలా ఉండొద్దనుకుంటున్నానని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పిరికి పందా, వంచకుడు అంటూ ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మె సమయంలో కేసీఆర్ ఎక్కడున్నారని పొన్నాల ప్రశ్నించారు.
తెలంగాణ కోసం కేసీఆర్ పార్లమెంట్లో ఎప్పుడైనా మాట్లాడారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో సామాజిక న్యాయం పాటిస్తామని పొన్నాల స్పష్టం చేశారు. టీఆర్ఎస్ది నిరంకుశ ఎజెండా అంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుని బంగారు తెలంగాణను నిర్మించడానికి కృషి చేస్తామని తెలిపారు. అమరుల త్యాగాలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, వారి త్యాగాలను గుర్తుంచుకుంటుందని పొన్నాల అన్నారు.