బొడ్డు, జక్కంపూడిలను గెలిపించండి | Sakshi
Sakshi News home page

బొడ్డు, జక్కంపూడిలను గెలిపించండి

Published Mon, May 5 2014 2:19 AM

బొడ్డు, జక్కంపూడిలను గెలిపించండి - Sakshi

 సాక్షి, రాజమండ్రి: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరూ రాజానగరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి జక్కంపూడి విజయలక్ష్మికి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరికి ఓటేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం ‘వైఎస్సార్ జనభేరి’లో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న ఆమె ఆదివారం కోరుకొండ బస్టాండ్‌సెంటర్‌లో జరిగిన సభలో మాట్లాడారు. మహానేత మరణానంతరం తమ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కష్టాలపాల్జేసిన తరుణంలో జక్కంపూడి  కుటుంబం తమకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.  
 
 దుశ్శాసన పాలనకు చరమగీతం
 అంతకుముందు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తొమ్మిదేళ్ల దుశ్శాసన, దుర్యోధన, దుర్వినీతి పాలనకు చరమగీతం పాడి  రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి సుపరిపాలన అందిం చారన్నారు. ఆయన మరణానంతరం ప్రజలు మళ్లీ దుర్మార్గపు పాలన చవిచూశారన్నారు. రాజన్న తెచ్చిన సువర్ణయుగం మళ్లీ తీసుకు వచ్చేందుకు జగన్‌మోహన్ రెడ్డి నడుం కట్టారని పేర్కొన్నారు. తాను జైల్లో ఉండి కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ఆమరణ దీక్ష చేసిన నేతను మన మందరం గెలిపించుకొని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
 
 ఇది ధర్మయుద్ధం
 ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ధర్మయుద్ధం అని ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఉంచి, విజయమ్మను అసెంబ్లీ సాక్షిగా కన్నీరు పెట్టించిన దుష్టపరిపాలనపై సాగుతున్న పోరాటమిదని అన్నారు. జగనన్న వదిలిన బాణం షర్మిలకు తోడుగా కార్యకర్తలు, అభిమానులు లక్షలాది, కోట్లాది బాణాలై ఆయనను అధికారంలోకి తేవాలని కోరారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, బొల్లిన సుధాకర్, మునగాడ ఫణి, అరకు పార్లమెంటు అభ్యర్థి కొత్తపల్లి గీత, రాజమండ్రి కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి ఎం. షర్మిలా రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement