దటీజ్ తమ్మినేని | Sakshi
Sakshi News home page

దటీజ్ తమ్మినేని

Published Wed, May 14 2014 3:06 AM

YSRCP Leader Tammineni Sitaram  ZPTC, MPTC win

ఆమదాలవలస, ఆమదాలవలస రూరల్, న్యూస్‌లైన్: ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలను గంపగుత్తగా దక్కించుకోవడం చిన్న విషయం కాదు. ప్రస్తుత మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో దాన్ని సాధ్యం చేసిన ఏకైక నేతగా తమ్మినేని సీతారాం తన ప్రత్యేకతను చాటుకున్నారు. జిల్లాలోని ఆమదాలవలస మినహా ఏ ఇతర నియోజకవర్గంలోనూ అన్ని మండలాలు టీడీపీకిగాని, వైఎస్‌ఆర్‌సీపీగాని లభించలేదు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాల వలస మున్సిపాలిటీతోపాటు నాలుగు మం డలాల(ఆమదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి) ఎంపీపీలు, మూడు జెడ్పీటీసీలు వైఎస్‌ఆర్‌సీపీ ఖాతాలో చేరాయి. వైఎస్‌ఆర్‌సీపీలో ఆలస్యంగా చేరిన తమ్మినేని.. అతితక్కువ కాలంలోనే నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు.
 
 కాంగ్రెస్, టీడీపీ క్యాడర్‌ను పార్టీ వైపు ఆకర్షించారు. నగరభేరి పేరుతో మున్సిపాలిటీలో సమస్యలు గుర్తించి అధికారుల ద్వారా వాటి పరిష్కారానికి ప్రయత్నించడం ద్వారా ప్రజలకు చేరువయ్యారు. స్థానిక సమస్యలపైనే కాకుండా థర్మల్, అణువిద్యుత్ ప్లాంట్లకు వ్యతిరేకంగా జిల్లాలో జరుగుతున్న ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పలు పరిశ్రమల్లో కార్మిక సమస్యలపైనా కార్మికుల పక్షాన పోరాడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన సీతారామ్ స్థానిక ఎన్నికల ఫలి తాలు ముందస్తు నజరానాగా లభించాయి. కాగా నియోజకవర్గంలో గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అభిమానులు తమ్మినేనిని కలిశారు  ఈ సందర్భంగా ఆయన వారికి అభినందనలు తెలిపారు.
 

Advertisement
Advertisement