ప్రైవేటు కంపెనీలతో విజయ డెయిరీ కుమ్మక్కు | Sakshi
Sakshi News home page

ప్రైవేటు కంపెనీలతో విజయ డెయిరీ కుమ్మక్కు

Published Tue, Jan 5 2016 3:39 AM

Ideal Dairy Farmers' Union criticism

ఆదర్శ పాడి రైతు సంఘం విమర్శ
 
 సాక్షి, హైదరాబాద్: విజయ డెయిరీ అధికారులు బడా ప్రైవేటు డెయిరీ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని ఆదర్శ పాడి రైతు సంఘం విమర్శించింది. విజయ డెయిరీని సమూలంగా ప్రక్షాళన చేయాలని సంఘం అధ్యక్షుడు ఎం.జితేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం ప్రతులను సోమవారం పత్రికలకు విడుదల చేశారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులందరికీ రూ. 4 ప్రోత్సాహకాన్ని ప్రకటించి, ఇప్పుడు షరతులు విధించడం వెనక కుట్ర ఉందన్నారు.

మూడెకరాల పాలీహౌస్ నిర్మించడానికి రూ. 72 లక్షలు సబ్సిడీ ఇస్తుంటే, 10 పశువులతో పాలు అమ్ముకునే రైతులకు ప్రోత్సాహకాన్ని ఇవ్వకూడదన్న విజయ డెయిరీ అధికారుల ధోరణి ఏమేరకు సబబని ప్రశ్నించారు. పౌల్ట్రీ కంపెనీలకు విద్యుత్, ఇతరత్రా రాయితీలు ఇస్తుంటే కరువు లో ఉన్న  రైతులకు షరతులు విధించడం అన్యాయమన్నారు. హైదరాబాద్‌కు రోజూ 25 లక్షల లీటర్ల పాలు అవసరం కాగా  కేవలం 4 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేస్తుండటం విడ్డూరమన్నారు. ప్రోత్సాహకం ఇచ్చాక పాల సరఫరా 5 లక్షల లీటర్లు పెరిగిందని వారు చెప్పారు.

Advertisement
Advertisement