బస్సులు ఢీ కొని ఇద్దరి దుర్మరణం | Sakshi
Sakshi News home page

బస్సులు ఢీ కొని ఇద్దరి దుర్మరణం

Published Tue, May 5 2015 11:33 PM

Killed , and two buses collide

హైదరాబాద్: డ్రైవర్ల నిర్లక్ష్యం ఫలితంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఒకే మార్గంలో రెండు బస్సులు ఢీ కొట్టిన ఘటనల్లో డిగ్రీ విద్యార్ధి, టీవీ మెకానిక్ మృత్యువాత పడ్డారు. గోపాలపురం హెడ్ కానిస్టేబుల్ ఎస్.శ్రీరాములు కథనం ప్రకారం..  ఖైరతాబాద్ చింతల్‌బస్తీలోని విజయ్‌కుమార్‌జైన్ నివాసి కుమారుడు అనూప్‌జైన్ (19) మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ద్విచక్ర వాహంపై రెజిమెంటల్‌ బజార్‌లోని తన మేనమామ మహవీర్‌చంద్ జైన్ ఇంటికి వచ్చాడు.


అక్కడి నుంచి మిత్రుడిని కలిసేందుకు సంగీత్ చౌరస్తాకు వస్తున్న క్రమంలో రాణిగంజ్ ఒకటో డిపో బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ అనూప్ సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. పోలీసులు ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటన..పాతబస్తీ ఆలీజాకోటకు చెందిన మహ్మద్ సనావుల్లా (62) టీవీ మెకానిక్‌షాపు నడుపుతున్నాడు. మంగళవారం ఉదయం యాఖుత్‌పురా నుంచి ఎంఎంటీఎస్ రైలులో తన కుమారుడు నవీదుల్లాతో కలసి సికింద్రాబాద్ బయలుదేరాడు. ఆలుగడ్డబావి సమీపంలో ఎంఎంటీఎస్ రైలుకు సిగ్నల్ దొరకని కారణంగా నిలిపివేశారు.


ఇంతలో రైలు దిగిన సనావుల్లా అతని కుమారుడు రోడ్డు మీదకు వస్తున్నాడు. రోడ్డుపైకి చేరుకుంటుండగానే సనావుల్లా కాలు జారి పడిపోయాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అతనిపై నుంచి దూసుకువెళ్లింది. ఆస్పత్రికి తరలించేలోగానే చనిపోయాడు. ప్రమాదానికి కారణమైన బస్సు, డ్రై వర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Advertisement
Advertisement