మనసెరిగిన నాయకుడు ‘వడ్డేపల్లి’ | Sakshi
Sakshi News home page

మనసెరిగిన నాయకుడు ‘వడ్డేపల్లి’

Published Wed, May 28 2014 1:08 AM

మనసెరిగిన నాయకుడు ‘వడ్డేపల్లి’

 మూసాపేట, న్యూస్‌లైన్: కార్యకర్తల మనసు తెలిసిన నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు అని, కూకట్‌పల్లిలో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని పలువురు నేతలు పేర్కొన్నారు. మూసాపేటలోని తూము పద్మారావు గార్డెన్‌లో మంగళవారం దివంగత వడ్డేపల్లి నర్సింగరావు సంతాప సభ ఏర్పాటు చేశారు. నేతలు సప్పిడి శ్రీనివాస్, ఖాజా పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వడ్డేపల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
 
కార్యకర్తలకు ఏ కష్టమొచ్చిన వెన్నంటి ఉండి వారి కష్టాలను తీర్చే నాయకుడని ఈ సందర్భంగా పలువురు నేతలు పేర్కొన్నారు. ఆయన కూకట్‌పల్లి రాజకీయాలకు కేంద్ర బిందువు అని, ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. కూకట్‌పల్లిని రాష్ట్రమంతటా పరిచయం చేసిన నాయకుడు వడ్డేపల్లి అని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన కూకట్‌పల్లి అంటే వడ్డేపల్లి గురించి అడిగేవారని తెలిపారు. రాజకీయాల్లోనే కాక భక్తి, సేవలో కూడా తనదైన ప్రత్యేకతను ఏర్పరుచుకున్న నేత అని వారు కీర్తించారు. కార్యక్రమంలో కూకట్‌పల్లి కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు, నేతలు దేవేందర్, కర్క పెంటయ్య, హరీష్‌రెడ్డి, వద్దిరెడ్డి చలమారెడ్డి, సత్యం, నాగిరెడ్డి, అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement