కారు కొనుక్కొనేందుకు ప్లాన్ వేసి... | Sakshi
Sakshi News home page

కారు కొనుక్కొనేందుకు ప్లాన్ వేసి...

Published Sat, Feb 21 2015 11:00 AM

కారు కొనుక్కొనేందుకు ప్లాన్ వేసి... - Sakshi

హైదరాబాద్ : ఎలాగైనా కారులో తిరగాలనే కోరిక ఓ యువకుడిని కటకటాలపాలు  చేసింది. కారు కొనుక్కోవడానికి అవసరమైన డబ్బు కోసం తన తల్లి పనిచేస్తున్న ఇంట్లోనే ఆ యువకుడు చోరికి యత్నించి దొరికిపోయాడు.  వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం. శ్రీనగర్ కాలనీ సమీపంలోని ఎల్ఐసీ కాలనీలో నివసించే సినీ డిస్ట్రిబ్యూటర్, బిల్డర్ సుధాకర్ ఇంట్లో పద్మ అనే మహిళ గత నాలుగేళ్లుగా పని చేస్తోంది. ఎప్పటిలాగే గురువారం సాయంత్రం 5.30కి పద్మ పని ముగించుకొని ఇంటికి వెళ్లింది.

కొద్దిసేపటికే పద్మ కొడుకు దుర్గా ప్రసాద్ (20) ఆ ఇంట్లోకి ప్రవేశించి యజమానురాలిపై కత్తితో దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో ఇరువురి మధ్య పెనుగులాట జరిగింది. ఈ సందర్భంగా యజమానురాలి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలి అరుపులు విని అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు వెంటనే వచ్చి దుర్గాప్రసాద్ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. యజమానురాలిని కత్తితో పొడిచి ఇంట్లో ఉన్న సొత్తు కాజేయాలని పథకం వేసుకొని అక్కడకి వచ్చినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు.

Advertisement
Advertisement