Sakshi News home page

అనుమానం.. పెనుభూతం

Published Thu, Feb 2 2017 12:29 AM

అనుమానం.. పెనుభూతం - Sakshi

భార్యపై అనుమానంతో గొంతుకోసి హత్య
ఆపై వృద్ధుడి ఆత్మహత్య


మల్కాజిగిరి: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ వృద్ధుడు అతి కిరాతకంగా ఆమె గొంతుకోసి హత్య చేశాడు. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ జానకిరెడ్డి, ఎస్‌ఐ సైదులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..యాదాద్రి జిల్లా వాసలమర్రి గ్రామానికి చెందిన బి.క్రిష్టయ్య(70) 15 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌లోని జెవైఎన్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య లక్ష్మి(60), ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు వివిధ ప్రాంతాల్లో స్థిరపడగా,  మనవడు (కూతురు కొడుకు) భాస్కర్‌ వీరితో కలిసి ఉంటున్నాడు. బుధవారం తెల్లవారుజామున కృష్ణయ్య స్వగ్రామంలో ఉంటున్న చిన్న కొడుకు సంతోష్‌కు ఫోన్‌ చేసి లక్ష్మి కరెంటు షాక్‌ కొట్టి చనిపోయిందని చెప్పాడు. దీంతో అతను మల్కాజిగిరిలో స్నేహితుల ఇంట్లో ఉన్న భాస్కర్‌కు సమాచారం అందించడంతో అతను ఇంటికి వెళ్లి చూడగా, అప్పటికే అమ్మమ్మ లక్ష్మి చనిపోయి ఉండడం, అపార్ట్‌మెంట్‌పై ఉన్న సెల్‌ టవర్‌కు తాత క్రిష్టయ్య ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు.

ఇన్‌స్పెక్టర్‌ జానకిరెడ్డి,  ఎస్‌ఐలు హఫీజ్, జేమ్స్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాగిలాన్ని రప్పించడంతో అది లక్ష్మి హత్యకు గురైన గది నుంచి అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌ మీదకు వెళ్లి కిందకు వచ్చింది. సంఘటనా స్ధలానికి కొద్ది దూరంలో చెత్త డ్రమ్ములో హతుడి చొక్కా, కర్చీఫ్, దిండు, హత్యకు ఉపయోగించిన కత్తి దొరికాయి. సంతోష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరచూ గొడవపడేవారు: భాస్కర్‌
రెండు నెలలుగా తన అమ్మమ్మ, తాత తరచూ గొడవపడేవారని భాస్కర్‌ తెలిపారు. సంఘటన జరిగిన రాత్రి తాను ఇక్కడ లేనని ప్రతి రోజూ స్నేహితుల ఇంటికి వెళ్లి అక్కడే నిద్రపోతానన్నారు. తాతకు కోపం ఎక్కువని ఎప్పుడూ అమ్మమ్మను తిట్టేవాడని ఇంత ఘోరం జరుగుతుందని ఊహించ లేదన్నాడు.
 

Advertisement

What’s your opinion

Advertisement