Sakshi News home page

పంచభూతాలనూ వదలకుండా తినేస్తున్నారు!

Published Sat, May 28 2016 1:55 PM

పంచభూతాలనూ వదలకుండా తినేస్తున్నారు! - Sakshi

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రెండేళ్ల పాలనా కాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. మహానాడు ఆత్మస్తుతి పరనిందే లక్ష్యంగా మారిందన్నారు. చంద్రబాబు పంచభూతాలను కూడా వదలకుండా తినేస్తున్నారని బొత్స ఎద్దేవా చేశారు.

హామీలు నెరవేర్చని చంద్రబాబుపై జూన్ 2వ తేదీన చీటింగ్ కేసులు పెట్టాలని నిర్ణయించామన్నారు. ఆరోజున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశాల అనంతరం చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామన్నారు.

అమరావతి అమరేశ్వరుని భూముల కొనుగోలుపై తక్షణమే విచారణ జరపించాలని బొత్స డిమాండ్ చేశారు. భూముల క్రయ, విక్రయాల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలన్నారు. లోకేశ్ కనుసన్నల్లోనే వెయ్యికోట్ల దోపిడీ జరిగిందన్నారు. దేవుడి భూముల్ని కూడా వదిలి పెట్టకుండా దోచుకుంటున్న ఘనత టీడీపీ నేతలదన్నారు. టీడీపీ నేతల దోపిడీని రాష్ట్ర ప్రజలంతా గమనించాలన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement