‘‘నాకెలాంటి ప్రమాదం జరగలేదు. అనవసరంగా గాభరా పడొద్దు. నాకు దెబ్బలు తగిలాయని వినిపిస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు’’ అని ఫేస్బుక్ ద్వారా తెలిపారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘బాహుబలి’ షూటింగ్ పనిమీద కేరళలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న షూటింగ్లో ప్రభాస్కి తీవ్రమైన గాయాలయ్యాయని ఓ రూమర్ ప్రస్తుతం వెబ్సైట్స్లో హల్చల్ చేస్తోంది. ప్రభాస్ అభిమానులను, శ్రేయోభిలాషులను భయాందోళనలకు గురిచేసిన రూమర్ ఇది.
దాంతో వారిని ఆందోళన చెందవద్దని ఫేస్బుక్ ద్వారా తెలిపారు ప్రభాస్. ‘‘నాకు ఎలాంటి దెబ్బలూ తగలలేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఐయామ్ పర్ఫెక్ట్లీ ఫైన్. నాకు దెబ్బలు తగిలాయి అనగానే.. చాలామంది గందరగోళానికి లోనయ్యారు. నాపై అంతటి ప్రేమని కనబరిచిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ నెల 13న ‘బాహుబలి’ షూటింగ్ కేరళలో మొదలైంది. చాలా ప్రశాంతంగా, కూల్గా, సజావుగా షూటింగ్ సాగిపోతోంది. ఎప్పుడెప్పుడు మీ ముందుకొస్తానా... అని ఆత్రుతగా ఉంది’’ అని ప్రభాస్ పేర్కొన్నారు.