సరికొత్త తెలుగు సినిమా ఇది..! - నాగచైతన్య | Sakshi
Sakshi News home page

సరికొత్త తెలుగు సినిమా ఇది..! - నాగచైతన్య

Published Sat, Apr 11 2015 1:02 AM

సరికొత్త  తెలుగు  సినిమా ఇది..!  - నాగచైతన్య - Sakshi

‘‘ఆరు నెలల క్రితం సుధీర్ వర్మ ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా బావుందనిపించింది. ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’’ అని నాగార్జున అన్నారు. నాగచైతన్య, కృతీ సనన్ జంటగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘దోచేయ్’. సుధీర్‌వర్మ దర్శకుడు. సన్నీ స్వరాలందించిన  ఈ సినిమా పాటల వేడుక శుక్రవారం సాయంత్రం  హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని నాగార్జున ఆవిష్కరించి కీరవాణికి అందజేశారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, ‘‘సన్నీ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. మేధావులు మాత్రమే మేజర్ స్కేల్‌లో పాటలు ఇస్తారు. సన్నీ ఈ సినిమాలో చేసిందదే.  ‘స్వామి రారా’ లో సుధీర్ వర్మ పనితనం నాకు బాగా నచ్చింది’’ అని చెప్పారు.  నాగచైతన్య మాట్లాడుతూ, ‘‘సరికొత్త తెలుగు సినిమా ఇది.  సుధీర్ వర్మ చాలా బాగా తీశాడు. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. 

సుధీర్ వర్మ  మాట్లాడుతూ, ‘‘ ఈ సినిమా చేయడానికి నాకు సపోర్ట్ చేసిన నిర్మాతలకు, హీరో చైతూకు నా థ్యాంక్స్. సన్నీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’ అని అన్నారు.  బ్రహ్మానందం మాట్లాడుతూ, ‘‘ఈ సినిమాలో సినిమా హీరోగా నటించాను. చాలా వెరైటీగా కామెడీ చేయించాడు దర్శకుడు సుధీర్. చైతన్య ఎప్పుడూ తనకు నచ్చే, నప్పే పాత్రలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రాన్ని అందరికీ నచ్చే సినిమా అవుతుంది’’ అని అన్నారు. ‘‘దర్శకునికి తాను తీయాలనుకున్న సినిమా గురించి, కథ గురించి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నాకు ‘స్వామి రారా’ సినిమా చూశాక సుధీర్‌లో ఉందనిపించింది. ఈ సినిమాలో పాజిటివ్ లుక్ కనిపిస్తోంది’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈ  వేడుకలో హీరోయిన్ కృతీ సనన్,  పోసాని కృష్ణమురళి, దర్శకులు సుకుమార్, చందు మొండేటి, నటులు రాజా రవీంద్ర, రవివర్మ, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement