సామి సీక్వెల్‌లో కీర్తిసురేశ్‌ | Sakshi
Sakshi News home page

సామి సీక్వెల్‌లో కీర్తిసురేశ్‌

Published Thu, May 4 2017 1:29 AM

సామి సీక్వెల్‌లో   కీర్తిసురేశ్‌

నటి కీర్తీసురేశ్‌ గ్రోత్‌ చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. కోలీవుడ్‌లో తొలి చిత్రం ఇదు ఎన్న మాయం సో సో అనిపించుకుంది. రెండో చిత్రం రజనీమురుగన్‌ హిట్‌. మూడో చిత్రం రెమో అంతకంటే హిట్‌. కట్‌ చేస్తే స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు వరుస కడుతున్నాయి. ధనుష్‌కు జంటగా నటించిన తొడరి చిత్రం నటిగా కీర్తీకి మంచి పేరు తెచ్చిపెట్టగా, ఇళయదళపతి విజయ్‌తో జత కట్టిన భైరవా భారీ చిత్రంగా నిలిచింది. తాజాగా సూర్యతో తానాసేర్నద కూటం చిత్రంలో నటిస్తున్నారు. మరో పక్క టాలీవుడ్‌లోనూ వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న కీర్తీసురేశ్‌ ప్రస్తుతం అక్కడ స్టార్‌ హీరో పవన్‌కల్యాణ్‌తో డ్యూయెట్లు పాడుతున్నారు. అదే విధంగా మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కనున్న ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు)లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇలా ఇప్పటికే క్రేజీ నాయికగా రాణిస్తున్న కీర్తీసురేశ్‌ తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు తాజా సమాచారం.

సియాన్‌ విక్రమ్‌తోనేననే బదులు వస్తోంది. విక్రమ్‌ ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ధ్రువనక్షత్రం, యువ దర్శకుడు విజయ్‌చందర్‌ దర్శకత్వంలో స్కెచ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు మూడో చిత్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. ఈయన ఇంత క్రితం హరి దర్శకత్వంలో నటించిన సామి చిత్రం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. దానికి సీక్వెల్‌ రానుందన్న ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. ఇప్పుడా సీక్వెల్‌కు సమయం ఆసన్నమైంది. సామి చిత్రంలో నటించిన పలువురు రెండవ భాగంలోనూ నటించనున్నారు. అదే విధంగా సామి చిత్ర నాయకి త్రిషనే ఈ చిత్రంలోనూ నటించనున్నారట.

మరి కీర్తీసురేశ్‌ విషయం ఏమిటనేగా మీ సందేహం. ఇటీవల దర్శకుడు హరి చిత్రాల్లో ఇద్దరు కథానాయికలు నటించడం పరిపాటిగా మారింది. సామి–2 చిత్రంలోనూ మరో నాయకిగా కీర్తీసురేశ్‌ను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను దర్శకుడు హరి ఇప్పటికే మొదలెట్టేశారు. మరో మూడు నెలల్లో సామి–2 సెట్‌ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.

Advertisement
Advertisement