విశాల్‌తో జోడీ కుదిరింది | Sakshi
Sakshi News home page

విశాల్‌తో జోడీ కుదిరింది

Published Sun, Dec 18 2016 1:08 AM

విశాల్‌తో జోడీ కుదిరింది

వయసు, అనుభవం లాంటి వాటిని పక్కన పెడితే యువ నటి కీర్తీసురేష్‌ ఇప్పుడు అగ్రనాయకిల పట్టికలో చేరిపోయారు. ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం ఇదు ఎన్న మాయం సక్సెస్‌ పరంగా పెద్దగా మాయ చేయలేకపోయినా ద్వితీయ చిత్రం రజనీమురుగన్, తృతీయ చిత్రం రెమో సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. దీంతో ఏకంగా ఇలయదళపతి విజయ్‌తోనే రొమాన్స్  చేసే అదృష్టం తలుపు తట్టింది. ఆయనతో నటించిన భైరవా త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా మరో స్టార్‌ హీరో సూర్యతో తానా సేర్న్‌దకూట్టం చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు తెలుగులో నానీతో నేను లోకల్‌ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌తో డ్యూయెట్లు పాడటానికి సిద్ధం అవుతున్నారు.

ఇక కోలీవుడ్‌లో మరో స్టార్‌ హీరో విశాల్‌తోనూ జత కట్టడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. కత్తిసండై చిత్రాన్ని పూర్తి చేసి ప్రస్తుతం మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్  చిత్రంలో నటిస్తున్న విశాల్‌ తదుపరి సండైకోళి–2 చిత్రానికి రెడీ అవుతున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రీ పొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది పిబ్రవరిలో చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. కాగా సండైకోళి చిత్రంలో విశాల్‌కు తండ్రిగా నటించిన నటుడు రాజ్‌కిరణ్‌నే దానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న సండైకోళి–2 చిత్రంలోనూ నటించనున్నారు. ఇందులో నాయకిగా కీర్తీసురేష్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం.

Advertisement
Advertisement