మణిరత్నం సినిమా ఖరార్ | Sakshi
Sakshi News home page

మణిరత్నం సినిమా ఖరార్

Published Wed, Apr 2 2014 11:34 PM

మణిరత్నం సినిమా ఖరార్ - Sakshi

దక్షిణాదిలోనే ఓ భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. మణిరత్నం దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సంచలన చిత్రం రూపొందనుంది. ఇందులో నాగార్జున, మహేశ్‌బాబు నటించనున్నారు. ఈ విషయం ఎట్టకేలకు సాధికారికంగా వెల్లడైంది. ఈ చిత్రంలో నాగ్ సరసన ఐశ్వర్యారాయ్, మహేశ్‌కి జోడీగా శ్రుతీహాసన్ చేయనున్నారు. ఈ కాంబినేషన్‌లో మణిరత్నం ద్విభాషా చిత్రం చేస్తున్నట్లు సుహాసిని ఓ తమిళ చానల్‌కు బుధవారం తెలిపారు. తెలుగులో ఓ అగ్రనిర్మాణ సంస్థతో కలిసి మణిరత్నం ఈ ప్రాజెక్ట్ చేయనున్నారని సమాచారం. నిజానికి, ఈ ప్రాజెక్టుపై మణిరత్నం చాలాకాలంగా కసరత్తులు చేస్తున్నారు. నాగార్జునతో ‘గీతాంజలి’ తర్వాత ఆయన డెరైక్ట్‌గా తెలుగులో ఏ సినిమా చేయలేదు.
 
  తెలుగునాట కూడా మణిరత్నంకు చాలా మంది అభిమాను లున్నారు. మణిరత్నంతో సినిమాకు మహేశ్ చాలా కాలంగా ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఏడాది ఓ భారీ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, ఎందుకో కార్యరూపం ధరించలేదు. ‘కడలి’ తర్వాత మణిరత్నం ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఎట్టకేలకు ఇప్పుడీ సినిమా పట్టాల మీదకెక్కు తోంది. దాంతో, మహేశ్ ఈ సినిమా చేయడం లేదంటూ ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలు తప్పని తేలింది. ఇందులో ఓ పాకిస్తానీ నటి కూడా కీలకపాత్ర పోషించనున్నారట. హాలీవుడ్ చిత్రం ‘బోర్న్ ఐడెంటిటీ’ తరహాలో ఇది స్పై థ్రిల్లర్ అని చెన్నై వర్గాల కథనం. రెహమాన్ దీనికి స్వరాలందించనున్నారట. రవివర్మన్ ఛాయాగ్రాహకుడు.
 

Advertisement
Advertisement