నాగ్-కార్తీ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ | Sakshi
Sakshi News home page

నాగ్-కార్తీ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్

Published Wed, Feb 11 2015 10:47 PM

నాగ్-కార్తీ కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ - Sakshi

నాగార్జునకు తమిళనాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గీతాంజలి, శివ, రక్షకుడు తదితర చిత్రాలు తమిళంలోనూ విడుదలై, విజయం సాధించాయి. అలాగే తమిళ హీరో కార్తీ నటించిన సినిమాలన్నీ దాదాపుగా తెలుగులో విడుదలవుతుంటాయి. ఆ విధంగా కార్తీకి ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇలా రెండు భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి చిత్రనిర్మాత సతీమణి ఝాన్సీ సురెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నాగ్ సతీమణి అక్కినేని అమల క్లాప్ ఇచ్చారు. వంశీ పైడిపల్లి సతీమణి మాలిని గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ - ‘‘ఇది చాలా మంచి కథ. కచ్చితంగా విభిన్న తరహా మల్టీస్టారర్ అవుతుంది’’ అని తెలిపారు. తెలుగులో తన తొలి స్ట్రయిట్ చిత్రం నాగార్జునతో కలిసి చేయడం ఆనందంగా ఉందని కార్తీ చెప్పారు.

ఈ చిత్రంలో నటించడానికి నాగార్జున, కార్తీ అంగీకరించడం సగం విజయం సాధించినట్లుగా ఉందనీ, ఈ చిత్రం ద్వారా దర్శకునిగా తనను తమిళంలో పరిచయం చేస్తున్న పీవీపీకి ధన్యవాదాలని దర్శకుడు అన్నారు. వచ్చే నెల 16న రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ: వంశీ పైడి పల్లి-హరి-సాల్మన్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: గోపీసుందర్, కెమెరా: పి.ఎస్. వినోద్, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సునీల్‌బాబు.

Advertisement

తప్పక చదవండి

Advertisement