న్యూఢిల్లీ: బాహుబలి ఘన విజయంతో ఉత్సాహంతో ఉన్న సినీ హీరో ప్రభాస్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి, పెదనాన్న కృష్ణంరాజుతో కలసి ప్రభాస్.. మోదీతో సమావేశమయ్యారు. బాహుబలి సినిమా గురించి విన్నానని, ఈ చిత్రం చాలా బాగుందని తనకు చాలా మంది చెప్పారని మోదీ అన్నారని కృష్ణంరాజు తెలిపారు.
మోదీతో 10 నిమిషాలు మాట్లాడామని, చాలా సంతోషం కలిగిందని ప్రభాస్ చెప్పారు. బాహుబలి సినిమా చూడాలని తాను ప్రధానిని కోరగా.. ప్రస్తుతంగా బిజీగా ఉన్నానని, తప్పకుండా చూస్తానని చెప్పారని ప్రభాస్ తెలిపారు. తన జీవితంలో ఈ రోజు చాలా సంతోషకరమైనదని అన్నారు. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులు బాహుబలిని చూశారని తెలిపారు. బాహుబలి దేశానికే గర్వకారణమని ప్రభాస్ అన్నారు.
శనివారం ప్రభాస్ కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన సంగతి తెలిసిందే. శాలువాతో రాజ్నాథ్ను సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్.. హీరో ప్రభాస్ను అభినందించారు.