Sakshi News home page

ఇఫ్తార్ కలిపింది ఇద్దరినీ

Published Mon, Jul 7 2014 10:11 PM

ఇఫ్తార్ కలిపింది ఇద్దరినీ - Sakshi

 ఉప్పూ నిప్పులాగా ఉండే బాలీవుడ్ సూపర్‌స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లిద్దరు మరోసారి కలుసుకోవడంతో వీరి అభిమానుల సంతోషానికి హద్దే లేకపోయింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఇఫ్తార్ పార్టీలో కలిశారు. కొంతకాలంగా వీరిమధ్య నెలకొన్న విబేధాల వల్ల దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఖాన్‌లు హఠాత్తుగా కలుసుకోవడం ఇఫ్తార్ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ ఆదివారం రాత్రి ముంబైలో ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి ప్రతి సంవత్సరం మాదిరిగానే సల్మాన్, షారుఖ్‌ను కూడా ఆహ్వానించారు.
 
 దీంతో ఈ బడా హీరోలిద్దరూ బాబా ఆహ్వానం మేరకు ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు. ఒకరికొకరు తారసపడగానే షేక్‌హ్యాండ్ ఇచ్చుకొని ఆలింగనం చేసుకున్నారు. ‘కరన్ అర్జున్’ సినిమాకు ముందు వీరి మధ్య మంచి స్నేహసంబంధాలు ఉండేవి. కొంత కాలంగా దూరం పెరిగింది. కారణాలేంటన్నది తెలియకపోయినప్పటికీ వీరిద్దరి శత్రుత్వం గురించి బాలీవుడ్‌లో చాలా పుకార్లు వినిపిస్తుంటాయి. విశేషమేమంటే  2013 జులై 21న బాబా ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో ఖాన్‌లు కలిశారు. దీంతో వీరి మధ్య దూరం తగ్గిందని, మళ్లీ సినిమాలు తీస్తారని భావించారు.
 
 ఇఫ్తార్ ముగిసిన తరువాత తిరిగి ఎప్పుడూ కలుసుకోలేదు. మళ్లీ ఆదివారం నాటి ఇఫ్తార్ పార్టీలోనే ఈ సూపర్‌స్టార్లు మెరిశారు. ఇక్కడ వీళ్లిద్దరు ఎంతో స్నేహంగా మెలిగినా, ఇద్దరి మధ్య శత్రుత్వం మాత్రం తొలగిపోలేదని పార్టీకి వచ్చిన వారిలో కొందరు అభిప్రాయపడ్డారు. వైరాన్ని పక్కనబెట్టి మళ్లీ స్నేహితులుగా మారాలని షారుఖ్, సల్లూభాయ్ అభిమానులు కోరుకుంటున్నారు. షారుఖ్ ఇటీవలి సినిమాలు జబ్ తక్ హై జాన్, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ భారీ విజయం సాధించాయి. సల్మాన్ జై హో మాత్రం హిట్ కొట్టలేకపోయింది.
 

Advertisement

What’s your opinion

Advertisement