ఏపీ, తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధం | Sakshi
Sakshi News home page

ఏపీ, తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధం

Published Thu, Feb 25 2016 2:25 PM

ఏపీ, తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు రంగం సిద్ధం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే జూన్ లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీ కోసం త్వరలోనే షెడ్యూలు విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వచ్చే కొద్ది కాలంలో ఖాళీ అయ్యే స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చే ఏప్రిల్ లో ఖాళీ అవుతున్న 13 స్థానాలను భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం షెడ్యూలు విడుదల చేసింది.

అస్సాం (2), హిమాచల్ ప్రదేశ్ (1), కేరళ (3), నాగాలాండ్ (1), త్రిపుర (1), పంజాబ్ (5) రాష్ట్రాల్లో 13 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం వచ్చే ఏప్రిల్ లో పూర్తవనుంది. ఆ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలు ప్రకటించింది. ఈ ఎన్నికల నిర్వహణకు మార్చి 4 న నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈ స్థానాలకు మార్చి 21 న పోలింగ్ నిర్వహిస్తారు.  

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పదవీ కాలం పూర్తవుతున్న సభ్యుల స్థానంలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల్లోనే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూలు విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి సుజనా చౌదరి (టీడీపీ), నిర్మలా సీతారామన్ (బీజేపీ), జైరాం రమేశ్ (కాంగ్రెస్), జేడీ శీలం (కాంగ్రెస్)ల పదవీకాలం జూన్ 21తో పూర్తవుతోంది. అలాగే తెలంగాణలో వీ హన్మంతరావు (కాంగ్రెస్), గుండు సుధారాణి (టీడీపీ - తర్వాత టీఆర్ఎస్ లో చేరారు)ల పదవీ కాలం కూడా అదే సమయానికి పూర్తవుతోంది.

Advertisement
Advertisement