న్యూఢిల్లీ : గోవా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్లలో బీజేపీ హవా కొనసాగుతుండగా, పంజాబ్లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఇండియా టుడే ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరాఖండ్లోనూ బీజేపీ హవా కొనసాగనుందని స్పష్టం చేసింది. అక్కడి ప్రజలు బీజేపీకే పట్టం కట్టనున్నట్టు పేర్కొంది. ఉత్తరాఖండ్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ 41-46, కాంగ్రెస్ 18-23సీట్లు గెలిచే అవకాశం ఉందని అభిప్రాయపడింది. బీజేపీ 45శాతం, కాంగ్రెస్కు 33 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
గోవాలో 20-24 సీట్లు సాధించి బీజేపీ ముందంజలో ఉండే అవకాశం ఉందని సర్వేలో తేలింది. కాంగ్రెస్కు 13-15 సీట్లు, ఆప్కు 1-4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయితే పంజాబ్లో మాత్రం కాంగ్రెస్కే ఆధిక్యత రానుందని ఇండియా టుడే ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్కు 56-62 సీట్లు, ఆప్కు 36-42 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
కాగా, ఉత్తర్ప్రదేశ్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించనున్నట్టు ఇండియాటుడే ఒపీనియన్ పోల్ సర్వేలో పేర్కొన్న విషయం తెలిసిందే. బీజేపీకి 33 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని సర్వే తెలిపింది. నోట్ల రద్దు తర్వాత అనూహ్యంగా బీజేపీకి 31 నుంచి 33 శాతానికి ఓట్లు శాతం పెరిగింది. సమాజ్ వాదీ పార్టీకి 26 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశముందని తేలింది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు వివిధ దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాల్లో ఒకే విడతలో, మణిపూర్లో రెండు విడతల్లో, ఉత్తరప్రదేశ్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఈవీఎంల కౌంటింగ్, ఫలితాలు మార్చి 11న జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.