చిదంబరానికి సీబీఐ షాక్‌ | Sakshi
Sakshi News home page

చిదంబరానికి సీబీఐ షాక్‌

Published Mon, Nov 26 2018 4:21 PM

CBI Granted Permission To Prosecute Chidambaram In Aircel Maxis Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను ప్రాసిక్యూట్‌ చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు సీబీఐ సోమవారం పటియాలా హౌస్‌ కోర్టుకు తెలిపింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌‌ కేసు విచారణను చేపట్టిన ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి ఓపీ సైనీకి ఈ మేరకు సీబీఐ స్పష్టం చేసింది.

చిదంబరంను ఈ వ్యవహారంలో ప్రాసిక్యూట్‌ చేసేందుకు దర్యాప్తు ఏజెన్సీ అనుమతించిన పత్రాలను సీబీఐ, ఈడీల తరపున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు నివేదించారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితుల్లో ఆరుగురికి ప్రాసిక్యూషన్‌ అనుమతులు అవసరమని మెహతా తెలిపారు. మిగిలిన ఐదుగురు నిందితుల ప్రాసిక్యూషన్‌ కోసం అనుమతులు పొందే ప్రక్రియ సాగుతోందని చెప్పారు.

మరోవైపు ఈ కేసులో అరెస్ట్‌ నుంచి ఉపశమనం ఇస్తూ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు డిసెంబర్‌ 18 వరకూ కోర్టు మధ్యంతర ఊరట కల్పించింది. కాగా, తనను కుట్రపూరితంగా అరెస్ట్‌ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని తనపై ఆరోపణలన్నీ కట్టుకథలుగా చిదంబరం కోర్టుకు నివేదించారు.

Advertisement
Advertisement