జీఎస్టీపై మోదీ సర్కార్‌ జిమ్మిక్కులు..! | Sakshi
Sakshi News home page

జీఎస్టీపై మోదీ సర్కార్‌ జిమ్మిక్కులు : చిదంబరం

Published Wed, Dec 26 2018 12:05 PM

Chidambaram Fired At  BJP Over GST - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పలు వస్తువులను ఒకే జీఎస్టీ శ్లాబ్‌ కిందకు తీసుకువచ్చేందుకు మోదీ సర్కార్‌ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం మండిపడ్డారు. జీఎస్టీపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. జీఎస్టీలో సింగిల్‌ శ్లాబ్‌ ఉండాలని గతంలో విపక్షాలు చేసిన సూచనను పెడచెవిన పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం జీఎస్టీలో ఈ దిశగా మార్పులు చేస్తుండటాన్ని చిదంబరం వరుస ట్వీట్లలో ప్రశ్నించారు. నిన్నటి వరకూ జీఎస్టీలో ఒకే ఒక్క శ్లాబ్‌ ఉండాలన్న ఉద్దేశం పనికిమాలినదిగా పరిగణించిన ప్రభుత్వం ఇప్పుడు ఇదే తమ లక్ష్యంగా చెప్పుకొస్తోందని చిదంబరం మోదీ సర్కార్‌కు చురకలు వేశారు.

జీఎస్టీ స్టాండర్డ్‌ రేటు ప్రయోజనాలపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ నివేదికను తోసిపుచ్చిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఆమోదించిందని అన్నారు. నిన్నటివరకూ సుబ్రమణియన్‌ నివేదికను చెత్తబుట్టలో వేయగా హఠాత్తుగా అది ప్రస్తుతం ఆర్థిక మంత్రి టేబుల్‌పైకి వచ్చి చేరిందని, ప్రభుత్వ ఆమోదం పొందిందని ఎద్దేవా చేశారు.

గత ఏడాది జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 18 శాతం పన్ను శ్లాబ్‌ను స్టాండర్డ్‌ రేట్‌గా పరిగణించాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్‌ను చాలాకాలంగా పట్టించుకోని ప్రభుత్వం తాజాగా 99 శాతం వస్తువులను 18 శాతం శ్లాబ్‌లోకి తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించడం గమనార్హం.

Advertisement
Advertisement