ఢిల్లీ ప్రార్థ‌న‌లు: క్వారంటైన్‌కు 25 వేల మంది | Sakshi
Sakshi News home page

మ‌ర్క‌జ్ మ‌సీదు: క్వారంటైన్‌కు 25 వేల మంది

Published Mon, Apr 6 2020 8:02 PM

Coronavirus Outbreak: 25,000 Tablighi Jamaat Workers Quarantined - Sakshi

ఢిల్లీ: నిజాముద్దీన్ మ‌ర్కజ్‌కు వెళ్లిన త‌గ్లిబి జ‌మాత్ స‌భ్యుల‌తో పాటు, వారితో స‌న్నిహితంగా మెదిలిన 25వేల మందిని క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం వెల్ల‌డించింది. అంతేకాక జ‌మాత్ స‌భ్యులు బ‌స చేసిన హ‌ర్యానాలోని ఐదు గ్రామాలు నిర్బంధంలో ఉన్నాయని, ఆయా గ్రామాల ప్ర‌జ‌లు క్వారంటైన్‌లో ఉన్నార‌ని హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యా సలీలా శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా గ‌త నెల‌లో త‌గ్లిబి జ‌మాత్ స‌భ్యులు నిర్వ‌హించిన ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి ప‌లు రాష్ట్రాల‌ ప్ర‌జ‌ల‌తో పాటు క‌రోనా ప్ర‌భావిత దేశాల నుంచి విదేశీయులు సైతం పెద్ద సంఖ్య‌లో హాజ‌రైన విష‌యం తెలిసిందే. అనంత‌రం క‌రోనాతో స్వ‌స్థ‌లాల‌కు వెళ్ల‌డంతో కేసులు అమాంతం పెరిగిపోయాయి. (ఢిల్లీ మసీదుల్లో భారీ సంఖ్యలో విదేశీయులు)

తాజా ప‌రిస్థితి గురించి పుణ్యా సలీలా శ్రీవాస్తవ మాట్లాడుతూ.. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన 4067 కేసుల్లో 1445 త‌గ్లిబి జ‌మాత్ స‌భ్యుల‌కు సంబంధించిన‌వేన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌ర్క‌జ్ మ‌సీదు కార్య‌క్ర‌మానికి 2083 విదేశీ జ‌మాత్ స‌భ్యులు హాజ‌రైన‌ట్లు గుర్తించ‌గా, అందులో 1750 మందిని బ్లాక్‌లిస్టులో పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. లాక్‌డౌన్ వంటి ప‌లు కీల‌క చ‌ర్య‌ల వ‌ల్ల క‌రోనా వ్యాప్తి గొలుసును విచ్ఛిన్నం చేస్తామ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. జ‌మాత్‌కు అత్య‌ధికంగా గుజ‌రాత్ నుంచి 1500 మందికి పైగా హాజ‌ర‌య్యారు. తెలంగాణ నుంచి 1089 ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన‌ట్లుగా గుర్తించ‌గా అందులో 172 మందికి క‌రోనా సోకింది.  వారితో సన్నిహితంగా ఉన్న 93 మందికి కరోనా సోకినట్టు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెల్ల‌డించారు. (‘తబ్లిగి జమాత్‌’తో పెరిగిన కేసులు)

Advertisement
Advertisement