ముంబై: ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ ప్రేమికులిద్దరూ కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నారు. దాంతో నమ్మి వచ్చిన ప్రియురాలి గొంతుకోసి దారుణంగా హతమార్చాడో ప్రేమికుడు. ముంబైలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ప్రసాద్ సావంత్(26) ఏక్తా తల్వాద్కర్ (24) గత పదకొండేళ్లుగా ఒకర్నొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు.
అయితే వీరిద్దరికి నిర్ణయానికి పెద్దల ఆమోదం లభించలేదు. కలిసి జీవించడం కుదరదు కనుక...కలిసే ఈ లోకాన్ని వీడాలని ప్రేమికులు నిర్ణయించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఆదివారం సాయంత్రం కాలా చౌకీ ఏరియాలో కలుసుకున్నారు. అకస్మాత్తుగా ఏమైందో ఏమో తెలియదుగానీ వెంటతెచ్చుకున్న పదునైన కత్తితో ప్రసాద్ ప్రియురాలిపై దాడి చేసి గొంతు కోశాడు. అనంతరం అతగాడు పోలీసులకు లొంగిపోయాడు.
కాగా ట్రావెల్ కంపెనీలో పనిచేసే ఏక్తా ఆదాయమే ఆమె కుటుంబానికి ఆధారం. కుటుబానికి పెద్ద దిక్కులాంటి ఏక్తా మరణంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. అబ్బాయి మంచివాడు కాదని, అందుకే వారి పెళ్లికి అంగీకరించలేదని తండ్రి అంకుష్ వాపోయాడు. అయితే నిందితుడు ప్రసాద్ తాగుడుకు అలవాటుపడ్డాడని, హత్య జరిగిన సమయంలో కూడా బాగా మద్యం తాగి ఉన్నట్లు సీనియర్ పోలీసు అధికారి సూర్యకాంత్ తరాడే వెల్లడించారు. ప్రసాద్ గత పదిహేను రోజులుగా కత్తితో వెంటబెట్టుకుని తిరుగుతూ, ఒక పథకం ప్రకారమే ప్రియురాలి హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రసాద్పై హత్య కేసు నమోదు చేశామని తెలిపారు.