సబ్సిడీ కిరోసిన్‌పై కేంద్రం దృష్టి | Sakshi
Sakshi News home page

సబ్సిడీ కిరోసిన్‌పై కేంద్రం దృష్టి

Published Sun, Oct 2 2016 5:28 PM

Government's next agenda is better targeting of kerosene subsidy: Arun Jaitley

న్యూఢిల్లీ: సబ్సిడీలు పక్కదారి పట్టకుండా ఆహారం, ఎరువులకు సంబంధించి ప్రయోగాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన కేంద్రం తాజాగా కిరోసిన్‌పై దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కిరోసిన్‌ను ఇంధనంగా వినియోగిస్తున్నారని, అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇది నల్లబజారుకు తరలిపోతోందని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఆన్నారు. దీన్ని నివారించేందుకు కిరోసిన్‌ను ఇంధనంగా వాడకుండా రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఛండీగఢ్, హర్యానాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో జైట్లీ మాట్లాడారు. తదుపరి వ్యవస్ధీకరించాల్సిన వస్తువుల జాబితాలో కిరోసిన్‌ ఉన్నప్పటికీ సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలు ఇప్పటికీ కిరోసిన్‌ను ఇంధనంగా వినియోగిస్తున్నందున ఈ సమస్యకు తగిన పరిష్కారం కనుగొనాల్సి ఉందన్నారు.

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే కిరోసిన్‌ రాయితీని నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు వీలుగా 2016–17 సంవత్సరంలో ఏడు రాష్ట్రాల్లోని 39 జిల్లాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో సబ్సిడీ పక్కదారి పట్టకుండా నివారించడంవల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిధులు మిగులుతాయని, వాటిని సామాజిక కార్యక్రమాలకు వినియోగించే అవకాశం ఉందన్నారు.  
 

Advertisement
Advertisement