ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

Published Wed, Feb 8 2017 2:38 AM

ఛత్తీస్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ - Sakshi

12 మంది మావోలు హతం!

చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారని జిల్లా ఎస్పీ అభిషేక్‌ మీనా ప్రకటించారు. జిల్లాలోని ఆకాబేడా పోలీస్‌ క్యాంపుపై మావోయిస్టులు దాడికి పాల్పడగా.. జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో మావోలు మరణించారని మీనా చెప్పారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాబేడాలో పోలీసులు జిల్లాస్థాయి గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని మరికొద్దిరోజుల్లో నిర్వహించనున్నారు. కార్యక్రమం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్న మావోలు.. దాన్ని అడ్డుకునేందుకు కార్యక్రమంలో ఎవరూ పాల్గొనకూడదని గ్రామీణులను హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున దాదాపు 50 మంది మావోలు పోలీస్‌ క్యాంపుపై దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బాంబులు, మోర్టార్లతో దాడికి పాల్పడ్డారు. వెంటనే తేరుకున్న పోలీసులు ఎదురుకాల్పులతో ధీటైన జవాబు ఇవ్వడంతో మావోలు అక్కడి నుంచి పారిపోయారు. కాగా, దాడిలో 12 మంది మావోలు మృతిచెంది ఉంటారని, వారి మృతదేహాలను తోటి మావోలు మోసుకెళ్లిఉంటారని మీనా చెప్పారు. మరోవైపు దంతెవాడ జిల్లా బచేలిలో ఎన్‌ఎండీసీకి చెందిన ఐదు వాహనాలను మావోలు తగలబెట్టారు.  100 కేజీల పేలుడు పదార్థం, 350 డిటోనేటర్లు, 1500 మీటర్ల వైరును ఎత్తుకెళ్లారు.

Advertisement
Advertisement