పెళ్లిలో చూసిన అమ్మాయికోసం చివరకు విలనై.. | Sakshi
Sakshi News home page

పెళ్లిలో చూసిన అమ్మాయికోసం చివరకు విలనై..

Published Tue, Sep 20 2016 9:16 AM

పెళ్లిలో చూసిన అమ్మాయికోసం చివరకు విలనై.. - Sakshi

న్యూఢిల్లీ: అచ్చం సినిమాలో విలన్లాగే.. మనసు పడిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఓ యువకుడు వికృత చేష్టలకు దిగాడు. ఇష్టపడిన అమ్మాయి అక్క కుమారుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకుంటేనే అతడిని విడిచిపెడతానని లేదంటే చంపేస్తానని బెదిరించాడు. అయితే, చివరకు పోలీసులు పథకం ప్రకారం అతడి ఆటను కట్టించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పింతూ కుమార్ అనే వ్యక్తిది బిహార్లోని బాగల్పూర్ జిల్లాలోని హిరాన్ కుద్నా అనే గ్రామం.

అతడు ఓ పెళ్లిలో ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. దీంతో ఎలాగైనా ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలని ఆలోచించి ఆ అమ్మాయి బావతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. అనంతరం వారితోపాటు ఢిల్లీకి మకాం మార్చాడు. తాను ఇష్టపడిన యువతి సోదరితో కూడా పరిచయం పెంచుకున్నాడు. అలా నెల రోజులుగడిచిన తర్వాత తన ప్రేమ విషయం ఆ ఇంట్లో వాళ్లకు చెప్పాడు. అయితే అతడికి ఏ ఉద్యోగం లేదని ఆ అమ్మాయిని ఇచ్చేందుకు నిరాకరించాడు.

దీంతో అప్పటి వరకు బుద్ధిమంతుడిలా ఉన్న పింటూ కుమార్ లో విలన్ బయటకొచ్చాడు. వెంటనే వాళ్ల ఆరేళ్ల పిల్లాడిని కిడ్నాప్ చేసి బిహార్ లోని షేక్ పూరా అనే గ్రామానికి పరారయ్యాడు. అనంతరం ఓ ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసి ఆ ఇంట్లో తాను ఇష్టపడిన ఆమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తేనే బాబును విడిచిపెడతానని లేదనంటే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం పోలీసులకు చెప్పడంతో వారు పథకం ప్రకారం అతడిని అరెస్టు చేసి బాలుడిని విడిపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement