‘దేశంలో లూటీ.. విదేశాల్లో భేటీ’ | Sakshi
Sakshi News home page

‘దేశంలో లూటీ.. విదేశాల్లో భేటీ’

Published Fri, Feb 16 2018 4:08 PM

Nirav Modi case: After guide to looting India Rahul Gandhi tweets scamsters escape formula - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిలియనీర్‌ జ్యూవెలర్‌ నీరవ్‌ మోదీ కుంభకోణంపై ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్ గాంధీ ట్వీట్ల దాడిని కొనసాగిస్తున్నారు. స్కామ్‌స్టర్లు దేశాన్ని లూటీ చేసి విదేశాలకు చెక్కేయడంపై మరోసారి తనదైన శైలిలో మోదీ సర్కార్‌ను ఎండగట్టారు. ‘లమో (లలిత్‌ మోదీ).. నిమో (నీరవ్‌ మోదీ) నమో (నరేంద్ర మోదీ)ను కలిసి.. పెట్టేబేడా సర్థుకుని విదేశాలకు పారిపోయార’ని వ్యాఖ్యానించారు. రాహుల్‌ మోదీరాబ్స్‌ఇండియా హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేశారు.

ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ ఇదే అంశంపై గురువారం రాహుల్‌ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దేశాన్ని లూటీ చేయాలంటే ప్రధాని మోదీని కౌగిలించుకుని.. ఆయనతో దావోస్‌లో కనిపించి..రూ 12,000 కోట్లు కొట్టేసి ఎంచక్కా విదేశాలకు చెక్కేయాలంటూ రాహుల్‌ వ్యంగ్యోక్తులతో ట్వీట్‌ చేశారు. కాగా 2010లో ఐపీఎల్‌ స్కామ్‌ వెలుగుచూసినప్పటి నుంచి లలిత్‌ మోదీ ఇంగ్లండ్‌లో తలదాచుకుంటున్నాడు.

ఇక పీఎన్‌బీ బాగోతం వెలుగుచూసే కొద్దిరోజుల ముందే నీరవ్‌ మోదీ భారత్‌ విడిచివెళ్లాడు. మరోవైపు లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా సైతం బ్యాంకులకు రూ.వేల కోట్ల బకాయిలతో బ్రిటన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement