'నా కారు తన బాయ్ ఫ్రెండ్కు ఇచ్చింది' | Sakshi
Sakshi News home page

'నా కారు తన బాయ్ ఫ్రెండ్కు ఇచ్చింది'

Published Fri, Mar 11 2016 1:23 PM

'నా కారు తన బాయ్ ఫ్రెండ్కు ఇచ్చింది' - Sakshi

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ కుటుంబ జీవితం గాడిలో పడిందని అనుకుంటున్న తరుణంలో ఆయన కుటుంబంలో కలహాల కల్లోలం చెలరేగింది. దర్శన్ ప్రవర్తన తనను ఇబ్బంది పెడుతోందని , అతడిని పిలిచి మందలించాలంటూ భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. ఇక విజయలక్ష్మి ఫిర్యాదును అనుసరించి రాష్ట్ర మహిళా కమిషన్ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని నమోదే చేయడంతో వ్యవహారం మరింత వేడెక్కింద. ఏడాదిన్నర కాలంగా తను వేరుగా ఉంటున్నానని విజయలక్ష్మి చెబుతుండగా , ఆమెకు మరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అందుకే ఆ విధంగా వ్యవహరిస్తోందని దర్శన్ చెబుతుండటం గమనార్హం.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే... భర్త దర్శన్ తో నెలకొన్న విభేదాల నేపథ్యంలో విజయలక్ష్మి ఏడాదిన్నర కాలంగా వేరుగా ఉంటున్నారు. వీరి కుమారుడు సైతం తల్లితోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విజయలక్ష్మి నివాసం ఉంటున్న ఫ్లాట్ వద్దకు వచ్చిన దర్శన్ అక్కడి సెక్యూరిటీ తో ఘర్షణ పడటంతో పాటు భార్య విజయలక్ష్మి ని అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న చెన్నమ్మన్న కెరె అచ్చుకట్ట స్టేషన్ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం తీసుకుని ఫిర్యాదు నమోదు చేశారు. కాగా రెండేళ్లుగా దంపతులిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలిత్తినట్టు తెలుస్తోంది.

నా కారును బాయ్ఫ్రెండ్ కు ఇస్తే ప్రశ్నించా..
ఆ ఉదంతంపై దర్శన్ స్పందిస్తూ..' నేను కొన్న లగ్జరీ ఆడీ కారు విజయలక్ష్మి తన బాయ్ ఫ్రెండ్ కు ఇచ్చింది. అతను నా వాహనంలో తిరుగుతుండటం చూసి ఆ విషయాన్ని అడిగేందుకు విజయలక్ష్మి ఫ్లాట్ వద్దకు వెళ్లాను. అంతే తప్ప నేను ఏ రకంగానూ గొడవ చేయలేదు. విజయలక్ష్మి ఉంటున్న ఫ్లాట్ కు సంబంధించిన నిర్వహణ ఖర్చులతో పాటు ఇంటి అవసరాలకు కూడా నేనే డబ్బులు సమకూరుస్తున్నాను. అయినా నన్ను కనీసం ఇంటిలోకి రానివ్వకుండా సెక్యూరిటీ తో అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలోనే సెక్యూరిటీతో గొడవ జరిగింది. అంతేతప్ప నేను ఎవరి పైనా దాడికి దిగలేదు. నా ఎదుగుదలను చూడలేకనే ఇదంతా చేస్తున్నారు' అని తెలిపారు. ఇదే సమయంలో సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ వద్ద కూడా దర్శన్ తన వాదనను వినిపించినట్టు తెలుస్తోంది. ' మూడు రోజులుగా నా బిడ్డను చూడలేదు. నా కొడుకును చూసేందుకు ఫ్లాట్ వద్దకు వెళితే నన్న అడ్డుకున్నారు. రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నా వాటిని పరిష్కరించేందుకు ఎవరూ రాలేదు. నాకు కాస్త సమయం ఇవ్వండి, నా వాదనను కూడా వినండి' అని చెప్పినట్టు సమాచారం. ఇక ఈ కేసు విషయంలో తాను తీవ్రంగా కలత చెందానని, అందుకే విశ్రాంతి కోసం మైసూరు వెళుతున్నట్టు దర్శన్ చెప్పారు.

అవన్నీ అసత్యాలే...
విజయలక్ష్మికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ దర్శన్ చేసిన వ్యాఖ్యలను విజయలక్ష్మి ఖండించారు. 'నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు. నేను కొంతకాలం పాటు దర్శన్ నుంచి దూరంగా ఉన్నంత మాత్రాన నా గురించి ఇలాంటి అసత్య ప్రసారాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. నేను చాలా మంచి కుటుంబం నుంచి వచ్చాను. నాబిడ్డ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే నేను దర్శన్ నుండి దూరంగా ఉంటున్నాను' అని విజయలక్ష్మి పేర్కొన్నారు.

Advertisement
Advertisement