న్యూఢిల్లీ: నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) కేంద్రంలో పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తిచేసుకున్న తరుణంలో దేశ పౌరులకు ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వ వెబ్ సైట్ లో ఒక క్విజ్ నిర్వహించనుంది. మొత్తం 20 ప్రశ్నలు ఉండే ఈ క్విజ్ ను ఐదు నిమిషాల్లోగా పూర్తి చేయాలి.
ఈ పరీక్షలో విజయం సాధించిన వారికి మోదీ సంతకం చేసిన సర్టిఫికేట్ తో పాటు ఆయన ను పర్సనల్ గా కలిసే అవకాశం ఇవ్వనున్నట్లు ఎన్డీయే ప్రకటించింది. క్విజ్ లో పాల్గొనాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మై గవర్నమెంట్.ఇన్ వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకోవాలని తెలిపింది. చివరితేదీ జూన్ 5 అని వెల్లడించింది. కేవలం క్విజ్ కే ప్రజలను పరిమితం చేయకుండా ప్రభుత్వ పనితీరుకు ఆన్ లైన్ ద్వారా రేటింగ్ కూడా ఇవ్వొచ్చని తెలిపింది.
రేట్ మై గవర్నమెంట్ ద్వారా నల్లధనం మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లంచగొండితనం నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలపై ఫీడ్ బ్యాక్ ను తీసుకోనున్నట్లు చెప్పింది. ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల దేశాభివృద్ధికి తోడ్పడినట్లవుతుందని వివరించింది. మే 25న ప్రారంభమైన ఈ క్విజ్ పోటీలో ఇప్పటివరకు 1,772 మంది పాల్గొన్నారు.