అందుకే సస్పెండ్‌ చేయించుకున్నారు: అవంతి | Sakshi
Sakshi News home page

అబద్ధాలు ఆడకపోతే బతకలేరు: మంత్రి అవంతి

Published Wed, Dec 18 2019 12:15 PM

Avanthi Srinivasa Slams On Chandrababu Naidu And TDP In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులు తీసుకువచ్చారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. సచివాలయ మీడియా సమావేశంలో బుధవారం మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ తీసుకువచ్చిన బిల్లులను చూసి సహించలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాకౌట్‌ చేశారని విమర్శించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కావాలనే సస్పెండ్‌ చేయించుకున్నారని, ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌ ఆధారాలతో సహా బయటపడటంతో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడలేక సస్పెండ్‌ చేయించుకున్నారని పేర్కొన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం లేదని చెప్పారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని పెట్టాలనుకోవడం సీఎం జగన్‌ చారిత్రాత్మక నిర్ణయం అని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబడిందని, చంద్రబాబు బినామీలు కొన్న భూముల ధరలు పడిపోతాయని బాధపడుతున్నాడని అన్నారు.

అప్పట్లో చంద్రబాబు భూములు బలవంతంగా లాక్కుంటున్నాడని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆందోళన చేశాడని, ఇప్పుడు చంద్రబాబు తాన అంటే పవన్‌ తందాన అంటున్నాడని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.  ఇక గంటా శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు అవకాశవాదులని, పదవి కోసం తమ పార్టీలోకి రావాలనుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు అబద్దాలు చెప్పకపోతే బ్రతకలేడని, గంటా శ్రీనివాసరావు అధికారం లేకపోతే బ్రతకలేడని విమర్శించారు. చంద్రబాబు ఒకసారి కులాన్ని.. మరోసారి ప్రాంతాన్ని రాజకీయాల కోసం ఉపయోగిస్తారని మండిపడ్డారు. సీఎం జగన్‌ ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు.. అలాగే అనుకూలం కూడా కాదని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement