సాక్షి, సిద్దిపేట : పరాయి పాలనపై తిరుగుబాటుచేసి త్యాగాలు, పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నా మని మంత్రి హరీశ్రావు అన్నారు. మళ్లీ అదే పరాయి పాలకుడు, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు ముందు చేతులు కట్టుకొని టికెట్ల కోసం వెంపర్లాడుతున్న కాంగ్రెస్, టీజేఎస్ నాయకులను చూస్తే బాధేస్తోందన్నారు. ఇదేనా మీ పౌరుషం అంటూ మహాకూటమి నాయకులపై మం త్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్లు మండిపడ్డా రు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలో జరిగిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన సభలో వారు పాల్గొన్నారు. హరీశ్రావు మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రారంభాని కి 2 రోజులే సమయం ఉందని, మహాకూటమి నేతలు ఇప్పటివరకు సీట్ల పంపకం కోసం సిగపట్లు పట్టు కొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ, అమరావతి వద్ద తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రం ఏర్పాటు నాటికి అంతా అల్లకల్లోలంగా ఉండేదని, విద్యుత్ కోతలు, సంక్షేమ పథకాల అమలులో అన్యాయం, విద్యా, వైద్య రంగాల్లో తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ఉండేదని వివరించారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను 4 ఏళ్లలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు పనిచేస్తున్నామన్నారు. కలసి ఉన్నన్ని రోజులు సంపదను దోచుకొని వారి ప్రాంతానికి పెట్టిన ఆంధ్రా నాయకులు.. రాష్ట్రం విడిపోయాక కూడా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. అటువంటి పరాయి నాయకులతో తెలంగాణ, టీజేఎస్ నేతలు కూటమి కట్టారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ పాలన కావాలో.. పక్కరాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కళ్లల్లో నిప్పులు పోసుకునే చంద్రబాబు భాగస్వామిగా ఉండే కూటమి పాలన కావాలో ప్రజ లే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. మహాకూటమి అధికారంలోకి వస్తే.. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే చీటికిమాటికి ఢిల్లీకి వెళ్లి రాహుల్ వద్ద, అమరావతికి వెళ్లి చంద్రబాబు వద్ద అనుమతులు తీసుకోవాల్సి వస్తుందని వివరించారు.
మోదీ పాలనలో ఒరిగిందేమీ లేదు..
వెనుకబడిన సామాజికవర్గం నుంచి వచ్చిన నాయకుడిగా నమ్మి మోదీని ప్రధాని చేస్తే.. ప్రజలకు ఆయన ఒరగ బెట్టిందేమీ లేదని హరీశ్ విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేసి నల్లధనం వెలికితీస్తామని చెప్పా రని.. కానీ పేదలు దాచుకున్న డబ్బులు కూడా తీసుకోలేని దుస్థితి ఏర్పడిందని అన్నారు. బీసీల అభ్యు న్నతి కోసం ప్రత్యేక బీసీ కమిషన్ ఏర్పాటు చేయా లని టీఆర్ఎస్ ఎంపీలు, సీఎం కేసీఆర్ స్వయానా ప్రధానిని కోరినా.. పట్టించుకోలేదని ఆరోపించారు. విభజన చట్టంతో పనిలేకుండా మోదీ ప్రభుత్వం.. చంద్రబాబు భ్రమలో పడి ఏడు మండలాలు, విలువైన దిగువ సీలేరు విద్యుత్ ప్లాంట్ను ఏపీలో కలిపిందని పేర్కొన్నారు. మోదీ పాలనలో పెట్రోల్, డీజిల్ రేట్లతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు టీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
హరీశ్ను విమర్శిస్తే నాలుక చీరుతాం: ఈటల
‘ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజల మధ్య లో ఉన్నాం. ప్రజలకు సేవ చేయడం తప్ప మరొకటి తెలియని హరీశ్రావుపై కొందరు చేతకాని దద్దమ్మలు విషప్రచారం చేస్తున్నారు, అలాంటి వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తాం’ అని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. 15 ఏళ్లు ఉద్యమంలో ఉండి తెలంగాణ కోసం అసెంబ్లీలో ఆంధ్ర పాలకులకు ఎదురుగా బరిగీసి నిలబడ్డామని చెప్పారు. ఆనాడు నోరు మెదపని నాయకులంతా ఈరోజు విమర్శలు చేసేందుకు ముందుకు రావ డం శోచనీయ మన్నారు. ఒక పక్క విద్యుత్ కోతలు, మరొక పక్క బోర్లు వేసి నష్టపోయిన రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ వల్లకాడుగా మారితే.. నోరు మెదపని నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారని అన్నారు. కరెంట్ అడిగిన పాపానికి రైతులను కాల్చి చంపిన ఘనత మీది కాదా అని టీడీపీ నాయకులను ఈటల ప్రశ్నిం చారు. ముదిరాజ్లకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యా యం జరిగిందని అన్నారు. తెలంగాణ వచ్చాక ముదిరాజ్ల ఆత్మగౌరవం పెరిగేలా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
14న గజ్వేల్లో సీఎం కేసీఆర్ నామినేషన్
తూప్రాన్: ఈ నెల 14న గజ్వేల్లో సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. శుక్రవారం మెదక్ జిల్లా పోతరాజుపల్లిలో ఆయన టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో గ్రామాల్లోని బూత్ కమిటీ సభ్యులే కీలకమన్నారు. వంద ఓటర్లకు ఓ బూత్ సభ్యుడు ఉండేలా చర్యలు చేపట్టాలని నేతలకు సూచించారు. ప్రభు త్వం నుంచి అందిన పథకాల వివరాలను ప్రజలకు వివరించాలన్నారు. 70 శాతం ఓటర్లు టీఆర్ఎస్కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మిగతా 30 శాతం మంది సైతం టీఆర్ఎస్కు ఓట్లు వేసేలా ప్రచారం సాగించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, పార్టీ నేతలు ఎలక్షన్రెడ్డి, భూంరెడ్డి పాల్గొన్నారు.