సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్రను వక్రీకరించి, నిజాంను పొగిడే విధంగా చరిత్రను తిరిగి రాయిస్తామని సీఎం కేసీఆర్ మాట్లాడటం దారుణమని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు నిజాంను, టీఆర్ఎస్ను పొగిడే సమావేశాలుగా మారాయన్నారు. కేసీఆర్ నిజాంను పొగడటంతో తెలంగాణ సాయుధ పోరాట యోధులు బాధపడుతున్నారని చెప్పారు.
మజ్లిస్ పార్టీకి తెలంగాణను ధారాదత్తం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్టుగా ఉందన్నారు. భారతదేశంలో తెలంగాణ విలీనం కావడమే తప్పు అన్నట్టుగా సీఎం మాట్లాడుతున్నారన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడినవారంతా తప్పు చేసినట్టా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఖాసీం రజ్వీ పెట్టిన మజ్లిస్ పార్టీని సీఎం కేసీఆర్ పొగడటం ద్వారా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అన్నారు.