సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన ఆవిర్భవించనున్న పార్టీపై సోమవారం(2న) హైదరాబాద్లో ప్రకటన చేయనున్నారు. ఎన్నికల సంఘం ‘తెలంగాణ జన సమితి’పేరును ఖరారు చేసినట్లు జేఏసీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ పేరుకు అధికారికంగా ధ్రువీకరణ అందిన నేపథ్యంలో పార్టీ పేరు, జెండా, విధివిధానాలను బహిరంగంగా ప్రకటించాలని కోదండరాం నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ఈ నెల 2న పార్టీ పేరును ప్రకటిస్తారు.
ఈ నెల 4న పార్టీ జెండాను ప్రకటించి, ఆవిష్కరిస్తారు. పార్టీకి సంబంధించిన పోస్టర్ను కూడా 4న ఆవిష్కరిస్తారు. ఈ నెల 29న హైదరాబాద్లోనే భారీ బహిరంగసభను నిర్వహించాలనే యోచనలో కోదండరాం ఉన్నారు. కాగా, తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావ సభకు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అనుమతిని ఇవ్వాలని టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్రెడ్డి, టీజేఏసీ ఎల్బీనగర్ నియోజకవర్గ చైర్మన్ కె.వి.రంగారెడ్డి శనివారం రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర్రావును కలసి వినతిపత్రం అందజేశారు.