మద్దిలపాలెం (విశాఖ తూర్పు): విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ఈనెల 30వ తేదీని నయవంచన దినంగా పాటిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 12 గంటలపాటు నిరాహారదీక్ష చేయనున్నాయని ఆ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ చెప్పారు. బుధవారం మద్దిపాలెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్కు 15 ఏళ్లపాటు ప్రత్యేకహోదా ఇస్తానని నమ్మబలికారన్నారు. నాలుగేళ్లుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ దీన్ని సాధించడంలో విఫలమైన చంద్రబాబు తీరును ఎండగట్టేందుకు ఈ దీక్ష చేపట్టనున్నామన్నారు. పార్టీ «అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు విశాఖ వేదికగా నయవంచన దీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఈ దీక్షకు రాష్ట్రంలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కన్వీనర్లు, కో ఆర్డినేటర్లు అందరూ హాజరుకానున్నారన్నారు. డాబాగార్డెన్స్లోని ప్రభుత్వ మహిళా కళాశాల ఎదురుగా 30వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిరాహారదీక్ష చేపట్టనున్నామన్నారు.
వంచకుల భరతం పట్టేందుకు ప్రజలు సిద్ధం
ఇప్పడు దొంగ దీక్షలు చేసి రానున్న ఎన్నికలలో ఓట్లు దం డుకోవడానికి అధికారపక్షం కుట్ర పన్నుతోందని విజయప్రసాద్ విమర్శించారు. మొత్తం 25 మంది ఎంపీ సీట్లను మనం గెలిస్తే ప్రధాన మంత్రిని నిర్ణయించవచ్చునన్నారు. రాష్ట్ర విభజన చేసిన యూపీఏ ప్రభుత్వానికి ప్రజలు 2014లో డిపాజిట్లు రాకుండా చేశారని, ఈసారి టీడీపీకి చరమగీతం పాడాలన్నారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటాలు చేస్తూనే వున్నారన్నారు.
2 నుంచి ఎంపీ విజయసాయిరెడ్డిసంఘీభావయాత్ర: తైనాల
ప్రజా సంకల్పయాత్రకు సంఘీభావంగా రాజ్యసభ సభ్యు డు వి.విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారని విశా ఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ తెలిపారు. అక్రమాలు, కబ్జాలు ఏం రకంగా చేస్తున్నారు.. వీటి నుంచి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునేందుకు ఓ కార్యచరణ చేశామన్నారు. దానిలో భాగంగానే సంఘీభావ యాత్రను గాజువాక నుంచి ప్రారంభించి దక్షిణ నియోజకవర్గం వర్గం వరకు అన్ని వార్డుల్లో నిర్వహించేందుకు రూపకల్పన చేశామన్నారు. 12 రోజులపాటు 180 కిలోమీటర్ల యాత్రలో గుర్తించిన సమస్యలను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.
నయవంచనకుబ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
రాష్ట్ర ప్రజల ఆశను, ఆకాంక్షలకు సమాధులు కట్టేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఈనెల 30వ తేదీన తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడం వల్ల ప్రయోజనమేమిటని పార్టీ అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. వంచనకు దేశంలో బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబేనన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో నరేంద్ర మోడి ఇంటి వద్ద చంద్రబాబు దీక్ష చేయాలన్నారు. ఈ సమావేశంలో సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, సనపల చంద్రమౌళి, పసుపులేటి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి, కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాధం, రాష్ట్ర అదనపు కార్యదర్శులు జి.వి.రవిరెడ్డి, పక్కి దివాకర్, జాన్వెస్లీ, అనుబంధ సంఘాలు అధ్యక్షులు బోని శివరామకృష్ణ, రామన్నపాత్రుడు, శ్రీనివాస్గౌడ్, బద్రినాథ్, షరీఫ్, విద్యార్థి విభాగం ప్రతినిధులు కాంతారావు, టి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.
దీక్షపై అవగాహన కల్పించాలి
బూత్స్థాయిలో ప్రజావంచన దీక్షపై అవగాహన కల్పించి అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చేలా వార్డు అధ్యక్షులు కృషి చేయాలని వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా మే 2 వతేదీ నుంచి ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టే సంఘీభావ యాత్రకు వార్డు కమిటీలు సన్నద్ధం కావాలన్నారు. వార్డులో రూట్ మ్యాప్కు అనుగుణంగా యాత్ర కార్యకర్తలు హాజరవ్వాలన్నారు. వార్డులలో నెలకొన్న సమస్యలు, కబ్జాలు, ఆక్రమణల గురించి ఆరా తీసి యాత్రలో బాధితులు పాల్గొనేలా వార్డు అధ్యక్షులు కృషి చేయాలన్నారు.
దీక్ష స్థలి పరిశీలన
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఈ నెల 30న విశాఖలో చేపట్టనున్న ‘వంచన దినం’ కార్యక్రమ ఏర్పాట్లను వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి జాయింట్ పోలీస్ కమిషనర్ టి.రవికుమార్మూర్తి, ట్రాఫిక్ ఏసీపీ కింజరపు ప్రభాకరరావు బుధవారం పరిశీలించారు. వేదిక పరిశీలనలో పార్టీ నేతలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయ్కుమార్, గుడివాడ అమర్నాథ్, వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు.