ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘అన్నా.. మా ఉత్తరాంధ్రకు జ్వరాల పీడ పట్టుకుంది. ఊళ్లల్లో అంతా జ్వర పీడితులే. డెంగీ బాధితులే. పట్టించుకునే నాథుడే లేడు. కే కోటపాడు మండల కేంద్రంలోని ఆస్పత్రికి వెళితే విశాఖపట్నం కేజీహెచ్కు వెళ్లమంటున్నారు. అటూ ఇటూ తిరగలేక చచ్చిపోతున్నారన్నా.. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదన్నా..’ అని మాడుగుల నియోజకవర్గంలోని బొట్టువానిపాలెం గ్రామస్తులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఇదే రీతిలో పాదయాత్ర సాగిన దారిపొడవునా అసంఖ్యాకంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రోగాలతో జనం ఇక్కట్ల పాలవుతున్నా పాలకులకు ఏమాత్రం పట్టలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మాటలు నమ్మి మోసపోయామని, నాలుగున్నరేళ్లుగా అన్నీ కష్టాలేనని వాపోయారు. జగన్ రాకతోనే కష్టాలు తీరతాయని ఆకాంక్షించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 254వ రోజు మంగళవారం ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మీదుగా పాదయాత్ర సాగించి పెందుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించారు.
యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ప్రజలు ఎంతగా ప్రేమాప్యాయతలు ప్రదర్శించారో అదేరీతిలో కష్టాలూ చెప్పుకున్నారు. మాడుగుల.. హల్వాకు ప్రసిద్ధి. తియ్యటి హల్వాకు మించిన రీతిలో జగనన్న మాటలు భరోసా కలిగిస్తున్నాయని జనం కదం తొక్కుతూ పాట పాడుతూ ఆయన వెంట అడుగులో అడుగు వేశారు. యాత్ర ప్రారంభమైన రామచంద్రాపురంలో ప్రజలు రామదండులా కదిలారు. బొట్టువానిపాలెం పోటెత్తింది. కే సంతపాలెం, చంద్రయ్యపేటలో యువత కేరింతలు కొట్టింది. సూదివలస క్రాస్లో జనం జేజేలు పలికారు. పెందుర్తి నియోజకవర్గ ముఖద్వారమైన అయ్యన్నపాలెం అక్కున చేర్చుకుంది. అభిమాన జల్లులు కురిపించింది. బుదిరెడ్డిపాలెం ప్రేమాప్యాయతలకు చిహ్నంగా నిలిచింది. కాలువ గట్లు, చెట్టు.. పుట్టలు, గతుకుల రోడ్లు.. ఇవా మాకడ్డంకి అంటూ జనం ఉరుకులు పరుగులు తీశారు. తమ అభిమాన నేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, కలిసి ఫొటో దిగేందుకు తహతహలాడారు. ఓపక్క ఉక్కపోతతో తడిసి ముద్దవుతున్న వేళ జగన్ను ఆహ్వానించేందుకా అన్నట్టు మధ్యాహ్నం తర్వాత చిరు జల్లులు పలకరించాయి. ఆ జల్లులను లెక్కచేయకుండా జనం రోడ్లపైనే నిలబడి తమ ప్రియతమ నేతకు స్వాగతం పలికారు. పంట పొలాల్లోంచి రైతులు, కూలీలు.. బస్సుల్లోంచి, బస్సులపైనుంచి జనం.. అడుగో జగన్, అడుగడుగో జగన్ అంటూ ఆసక్తిగా చూశారు.
సమస్యల తోరణాలు
జగన్ను కలిసిన ప్రతి ఒక్కరిదీ ఒక్కో దీనగాథ. ప్రభుత్వ వైఫల్యానికి, కనికరం లేని తనానికి నిదర్శనాలు. గుళ్లేపల్లికి చెందిన బంగారయ్య చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ కోసం మూడేళ్లుగా బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా వడ్డీ పెరిగిందే తప్ప పంట రుణం మాఫీ కాలేదు. ఓసారి పాస్ పుస్తకమని, ఇంకోసారి వాస్తవ సాగుదారని.. ఇలా రకరకాలుగా అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారని జగన్ ఎదుట వాపోయారు. ముగ్గుబుట్ట వంటి తల, మూడో కాలుగా ఊతకర్రతో వచ్చిన ఓ అవ్వ రామచంద్రాపురం వద్ద జగన్ను కలిసి తనకు పింఛన్ రావడం లేదని చెప్పిన వైనం కదిలించివేసింది. అగ్రిగోల్డ్ సంస్థ దివాలాతో తమ పాప చదువు మధ్యలోనే ఆగిపోయిందని, పిల్ల చదువు కోసం రూ.30 లక్షలు డిపాజిట్ చేసి ఆర్థికంగా చితికిపోయమని మర్రివలసకు చెందిన జనపరెడ్డి వరలక్ష్మి బావురుమంది. అగ్రిగోల్డ్ నుంచి డిపాజిటర్లకు న్యాయం జరిగేలా చూడాలని జగన్ను కోరింది. గ్రేటర్ విశాఖ పరిధిలోని 11 డిస్పెన్సరీలలో పదేళ్లుగా పని చేస్తున్న తమను అన్యాయంగా తొలగించారని ఏఎన్ఎంలు విన్నవించారు. ఫార్మా కంపెనీల కాలుష్యంతో మత్స్యసంపద నాశనం అవుతోందని ముత్యాలంపల్లి మత్స్యకారులు గోడు వెళ్లబోసుకున్నారు. రామచంద్రాపురం వద్ద జగన్ను కలిసిన రైవాడ రిజర్వాయర్ ఆయకట్టు రైతులు తమకు ఎత్తిపోతల ద్వారా నీరు అందించాలని కోరారు. తమకు దగ్గర్లోనే ప్రాజెక్టు ఉన్నా నీరు అందడం లేదని వివరించారు. రైవాడ కాలువ లస్కర్లు (విశాఖ జీవీఎంసీ నీటి సరఫరా కాలువ) కూడా జగన్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. తాము 21 ఏళ్లుగా ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నా ఇంతవరకు క్రమబద్ధీకరించలేదని వాపోయారు.
వైఎస్సార్ చేయూత.. బడుగులకు భరోసా..
45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మహిళలకు గ్రామ సచివాలయాల ద్వారా నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఉచితంగా అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించడాన్ని వివిధ వర్గాల మహిళలు స్వాగతించారు. వైఎస్సార్ చేయూత పథకం.. బడుగు, బలహీన వర్గాలకు పెద్ద భరోసా అని మాడుగుల నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు జగన్కు అభినందనలు తెలిపారు. అమ్మఒడి పథకం అద్భుతమని ప్రశంసలతో ముంచెత్తారు. జగన్తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. కే సంతపాలెం వద్ద జగన్ను కలిసిన పలువురు విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీరు తెన్నులను వివరిస్తూ కొంతకాలంగా పాలకులు ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. అయ్యన్నపాలెం దాటాక ముస్లిం మైనారిటీ పెద్దలు జగన్ను కలిశారు. ముస్లింల పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు. చంద్రబాబు పాల్గొన్న గుంటూరు సభలో అరెస్ట్ చేసిన ముస్లిం పిల్లలకు ఎటువంటి హాని జరక్కుండా చూడాలని కోరారు. ఇదిలా ఉండగా పాదయాత్రలో పలువురు స్థానిక నేతలు వైఎస్సార్సీపీలో చేరారు.
మోసపోయామయ్యా..
అయ్యా.. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం నేను తీసుకున్న పంట రుణం కట్టలేదు. బాబు అధికారంలోకి వచ్చాక నేను రుణమాఫీకి అర్హుడినని కాగితం కూడా ఇచ్చారు. నిజమేనని ఇంతకాలం మెదలకుండా ఉంటే ఇప్పుడు నేను తీసుకున్న అప్పును వడ్డీతో కలిపి చెల్లించమని బ్యాంకోళ్లు నోటీసులు పంపిస్తున్నారు. తీసుకున్న అప్పు రూ.50 వేలయితే దాని మీద వడ్డీ రూ.30 వేలయింది. మొత్తం రూ.80 వేలు చెల్లించమంటున్నారు.. ఆ రుణం కట్టాలంటే నాకున్న ఎకరం పొలం అమ్మాలి. ఇంతకన్నా మోసం, దగా ఉంటుందా సార్?
– బొమ్మి అప్పలనాయుడు, గొట్టవానిపాలెం గ్రామం
దగా చేశారు..
అయ్యా.. మాది సూదివలస గ్రామం. నేను డ్వాక్రా మహిళా సంఘంలో ఉన్నా. మా రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మాటతో వాయిదాలు కట్టడం మానేశా. అసలు, వడ్డీలతో కలిపి నా పేరిట రూ.30 వేల అప్పుందని బ్యాంకులు నోటీసులు పంపిస్తున్నాయి. లేకుంటే మా ఇంటికి తాళం వేస్తామంటున్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. మాకు పసుపు కుంకుమల కింద ఇస్తామన్న రూ.10 వేలల్లో ఇప్పటికి రూ.2 వేలు ఇస్తే బ్యాంకులు ఆ మొత్తాన్ని వడ్డీ కింద జమ వేసుకున్నాయి. మహిళలని కూడా చూడకుండా మమ్మల్ని దగా చేశారయ్యా.. మీరే న్యాయం చేయాలయ్యా..
– వర్రి సన్యాసమ్మ
మా పిల్లలు బాగా చదువుకున్నారు
మాది కె.కోటపాడు మండలం సంతపాలెం గ్రామం. నా కాళ్లు చచ్చుబడిపోయి నడవలేని పరిస్థితిలో ఉన్నాను. నా ముగ్గురు పిల్లలు మహానేత రాజన్న ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతోనే చదువుకున్నారు. మా పెద్దపాప కె.లక్ష్మి ఎంటెక్ పూర్తి చేసి జాబు చేస్తోంది. మిగతా ఇద్దరు పిల్లలు కె.అప్పలనాయుడు (బీటెక్), కె.సన్యాసిరావు (బీఎస్సీ) పూర్తి చేశారు. మా పిల్లలకు దివంగత నేత.. ఉన్నత భవిష్యత్తు కల్పించినందుకు కృతజ్ఞతగా జగన్ను కలిశాను.
– కశిరెడ్డి గంగునాయుడు