Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకే కూటమి

Published Mon, Oct 15 2018 1:45 AM

Srinivas Goud comments on Congress and Mahakutami - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌తో ఒంటరిగా పోరాడే శక్తి లేని కాంగ్రెస్‌.. మహాకూటమి పేరుతో కొత్త దుకాణం పెట్టిందని మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వి.శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ హవాను ఢీకొనే పరిస్థితి ఏ పార్టీకి లేదని వ్యాఖ్యానించారు. కనీసం మేనిఫెస్టో తయారు చేయలేని కాంగ్రెస్‌ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లాకు నీళ్లు ఇవ్వలేనోళ్లు కూడా మహబూబ్‌నగర్‌లో తిరగడం హాస్యాస్పదంగా ఉందని, ఇక్కడ మూడ్రోజుల పాటు చేసిన షో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని విమర్శించారు.

కాంగ్రెస్‌ పార్టీని ఖతం చేయడానికి వచ్చిన టీడీపీతో దోస్తీ కట్టడాన్ని ప్రజలు విశ్వసించరని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణలో ప్రచారం చేయించగలిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. రాబోయే ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనని, రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. బీజేపీ జాతీయ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, నెల రోజుల్లో హైకోర్టు ఏర్పాటవుతుందని చెప్పి ఎందుకు ఆపారో వాళ్లే చెప్పాలన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement