సాక్షి, శ్రీకాకుళం : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత చేపట్టిన పాదయాత్ర 307వ రోజు మంగళవారం ఉదయం పాలకొండ నియోజకవర్గంలోని వీరఘట్టం మండలం యు.వెంకమ్మపేట నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వంలో తమకు జరుగుతున్న అన్యాయాలపై వివిధ వర్గాల ప్రజలు వైఎస్ జగన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అంటూ వైఎస్ జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు.
చంద్రబాబు మైనార్టీ ద్రోహి
వైఎస్ జగన్ ఆరోగ్యంగా ఉండాలని, పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మక్కా నుంచి తీసుకు వచ్చిన పవిత్ర జలాన్ని జననేతకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్సార్ కారణంగానే మైనార్టీలకు న్యాయం జరిగిందని గుర్తు చేసుకున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన రాజన్న రాజ్యం వైఎస్ జగన్తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు మైనార్టీ ద్రోహి అని విమర్శించారు.
నష్ట పరిహారం అందలేదు : తిత్లీ తుపాన్ భాదితులు
తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం అందలేదని తిత్లీ తుపాన్ భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. జన్మ భూమి కమిటీల ద్వారా తమకు చెందాల్సిన పరిహారాన్ని టీడీపీ కార్యకర్తలే తీసుకున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు.
రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులు, రెల్లి కులస్తులు వైఎస్ జగన్ను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు రెల్లి కులస్తులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్యాయం చేశారని వాపోయారు. సీఎం కాగానే రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జననేతకు విఙ్ఞప్తి చేశారు.
మీ వల్లే మా బిడ్డ బతికింది...
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సీతంపేట గ్రామానికి చెందిన ప్రసాద్- శ్రావణి సంధ్య దంపతులు వైఎస్ జగన్ను కలుసుకున్నారు.జననేత ఉచితంగా ఆపరేషన్ చేయించడం వల్లే తమ బిడ్డ బతికిందని ధన్యవాదాలు తెలిపారు. వీరితో పాటుగా వీరగట్టం మండల ప్రజలు, విద్యార్థులు, ఎలిసిపురం, అంకంపేట గ్రామస్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.