‘నీకు, నీ అన్నకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే’ | Sakshi
Sakshi News home page

‘నీకు, నీ అన్నకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే’

Published Thu, Mar 14 2019 4:26 PM

YSRCP Leader Vasantha Nageshwar Rao Fires On Minister Devineni Uma Maheshwar Rao In Krishna District - Sakshi

కృష్ణా జిల్లా: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాగేశ్వర రావు విలేకరులతో మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే దేవినేని ఉమ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. గణపవరంలో తనపై మంత్రి ఉమా వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. కొంగర మల్లయ్య అనే పదం వాడే ముందు నీ(ఉమ) రాజకీయ చరిత్ర గుర్తు చేసుకోవాలని సూచించారు. నీకు(ఉమ), నీ అన్నకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని గుర్తు చేశారు. తనకు కాళ్లు లేకపోయినా మాట్లాడే సత్తా ఉంది ఖబర్దార్‌ అంటూ హెచ్చరించారు. కొంగర మల్లయ్య లేస్తే మనిషిని కాదు అన్నాడేమో కానీ వసంత నాగేశ్వర రావు లేస్తే దేవినేని ఉమ పాలిట భయంకరుడని సమాధానమిచ్చారు. స్టీఫెన్‌ హకింగ్‌ అనే ప్రపంచ ఫ్రఖ్యాతి గాంచిన ఖగోళ శాస్త్రవేత్తకు కూడా కాళ్లు లేవని, కానీ ఖగోళ శాస్త్రంలో ఆయన అద్భుతాలు కనిపెట్టాడని గుర్తు చేవారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న జైపాల్‌ రెడ్డిని కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తనకు ఒకప్పుడు కాళ్లు ఉండేవి.. దేవినేని కుటుంబానికి ఊతం ఇచ్చి ఇప్పుడు కాళ్లు లేకుండా చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కాళ్లు ఉన్నా లేకపోయినా తాను చేయాల్సిన పాత్ర తాను చేస్తానని చెప్పారు.  తన గురించి ఇంత మాట్లాడుతున్నా వంటే ఈ కాళ్లు లేనోడిని చూసి భయపడి ప్రతిసారీ తన ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తున్నావని ప్రశ్నించారు. దేవినేని ఉమ ఓటమి భయంతోనే ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదన్నారు. మైలవరం నియోజకవర్గం ప్రజలు నిన్ను(దేవినేని ఉమ) ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని, నువ్వు కూడా తట్టా బుట్టా సర్దుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

Advertisement
Advertisement