నాగ్ పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పైచేయి సాధించింది. రెండో రోజు ఆటలో భాగంగా 11/2 ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన దక్షిణాఫ్రికా 33.1 ఓవర్లలో 79 పరుగులకే చాపచుట్టేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో జేపీ డుమినీ(35) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. భారత స్పిన్ త్రయం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశారు. రవి చంద్రన్ అశ్విన్ ఐదు, రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసి సఫారీలకు మరోసారి షాకివ్వగా, అమిత్ మిశ్రా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా టీ విరామ సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి108 పరుగులు చేసింది. క్రీజ్ లో రోహిత్ శర్మ(0), సాహా(0)లు ఉన్నారు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (5) ఆదిలో పెవిలియన్ కు చేరినా.. శిఖర్ ధవన్(39), చటేశ్వర పూజారా(31)లు రాణించారు. అటు తరువాత విరాట్ కోహ్లి(16), రహానే(9)లు స్వల్ప వ్యవధిలో నిష్క్రమించారు. టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 215 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియాకు 244 పరుగుల ఆధిక్యం లభించింది.