మన మహిళలదే సిరీస్‌ | Sakshi
Sakshi News home page

మన మహిళలదే సిరీస్‌

Published Wed, Jan 30 2019 1:35 AM

India vs New Zealand: Smriti Mandhana stars again as India Women clinch ODI series - Sakshi

మౌంట్‌ మాంగనీ: పురుషుల బాటలోనే భారత మహిళల క్రికెట్‌ జట్టు కివీస్‌ పని పట్టింది. అదే వేదికపై రెండో వన్డేలోనూ విజయం సాధించి 2–0తో సిరీస్‌ను గెలుచుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ మహిళలను చిత్తుగా ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 44.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ అమీ సాటర్‌వైట్‌ (87 బంతుల్లో 71; 9 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. జులన్‌ గోస్వామి 3 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... ఏక్తా బిష్త్, పూనమ్‌ యాదవ్, దీప్తి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్‌ 35.2 ఓవర్లలో 2 వికెట్లకు 166 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన స్మృతి మంధాన (83 బంతుల్లో 90; 13 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో సెంచరీ అవకాశాన్ని త్రుటిలో కోల్పోగా, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (111 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించింది. ఐసీసీ ఉమెన్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్‌ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. ఇరు జట్ల మధ్య చివరి వన్డే శుక్రవారం హామిల్టన్‌లో జరుగుతుంది.

కట్టడి చేసిన ఏక్తా... 
కెప్టెన్‌ సాటర్‌వైట్‌ పోరాటం మినహా కివీస్‌ ఇన్నింగ్స్‌లో చెప్పుకోవడానికేమీ లేదు. భారత బౌలింగ్‌ ముందు ఆ జట్టు పూర్తిగా తడబడింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే సుజీ బేట్స్‌ (0)ను జులన్, ఆ వెంటనే డెవిన్‌ (7)ను శిఖా ఔట్‌ చేసి జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత పరుగులు తీయడంలో ఇబ్బంది పడటంతో పాటు స్వల్ప విరామాల్లో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ఏక్తా బిష్త్‌ 8 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టి పడేసింది. తన వరుస ఓవర్లలో ఆమె డౌన్‌ (15), కెర్‌ (1)లను పెవిలియన్‌ పంపించింది. మరో వైపు ఓపిగ్గా ఆడిన సాటర్‌వైట్‌ 71 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత జోరు పెంచి దీప్తి శర్మ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన ఆమెను పూనమ్‌ ఔట్‌ చేయడంతో కివీస్‌ పతనం మరింత వేగంగా సాగిపోయింది.  
   
భారీ భాగస్వామ్యం... 
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌ 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. జెమీమా రోడ్రిగ్స్‌ (0) డకౌట్‌ కాగా, కొద్ది సేపటికే దీప్తి శర్మ (8) కూడా వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత భారత్‌ను కివీస్‌ నిరోధించలేకపోయింది. మరో వికెట్‌ పడకుండా స్మృతి, మిథాలీ జట్టును జట్టును విజయపథంలో నడిపించారు. చక్కటి షాట్లతో అలరించిన స్మృతి 54 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకుంది. ఇందులోనే 8 ఫోర్లు ఉండటం విశేషం. కెప్టెన్‌ మిథాలీరాజ్‌ ఆరంభంలో కొంత తడబడ్డా ఆ తర్వాత నిలదొక్కుకుంది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకునేందుకు ఆమెకు 102 బంతులు అవసరమయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరు చకచకా లక్ష్యం వైపు దూసుకుపోయారు. కెర్‌ వేసిన 36వ ఓవర్లో భారీ సిక్స్‌ కొట్టి కెప్టెన్‌ మ్యాచ్‌ను ముగించింది. స్మృతి, మిథాలీ మూడో వికెట్‌కు అభేద్యంగా 151 పరుగులు జోడించారు. 

Advertisement
Advertisement