తెలుగు టైటాన్స్ విజయం | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్ విజయం

Published Sun, Feb 14 2016 12:56 AM

తెలుగు టైటాన్స్ విజయం

ప్రొ కబడ్డీ లీగ్
పుణే: చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 27-25 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓడించింది. ఇది టైటాన్స్‌కు నాలుగో విజయం. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభంలో జైపూర్ ఆటగాళ్లు జోరు కనబరిచారు. ఆట చివరి 2 నిమిషాల వరకు కూడా జైపూర్ 23-18తో స్పష్టమైన ఆధిక్యంలోనే ఉంది. అయితే 38వ నిమిషంలో టైటాన్ తరఫున సబ్ స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ప్రశాంత్ కుమార్ రాయ్ అద్భుతమే చేశాడు. వచ్చీ రాగానే రైడ్‌కు వెళ్లిన తను 2 పాయింట్లు సాధించి స్కోరును 23-20కి చేర్చాడు. ఆ తర్వాత మెరాజ్ షేక్ స్కోరును సమం చేశాడు.

ఈ తరుణంలో జైపూర్ మెరుగ్గా ఆడి 25-24తో ఆధిక్యం సాధించింది. అయితే 41వ నిమిషంలో చివరి రైడ్‌కు వెళ్లిన ప్రశాంత్ రాయ్ ప్రత్యర్థి కోర్టులో ఉన్న ఏకైక ఆటగాడిని అవుట్ చేయడంతో ఆలౌట్ ద్వారా మూడు పాయింట్లు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. మెరాజ్ షేక్ మొత్తం ఏడు రైడ్, నాలుగు టాకిల్ పాయింట్లు సాధించాడు. జైపూర్‌లో సోను నర్వాల్ 5 రైడ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 29-27తో పుణెరి పల్టన్‌ను ఓడించింది.

Advertisement
Advertisement