పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్ పర్యటన చాలా సంతృప్తినిచ్చిందని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. చివరి మ్యాచ్ వర్షం వల్ల డ్రాగా ముగిసినా ఈ సిరీస్ ద్వారా వచ్చిన ఫలితంతో చాలా ఆనందంగా ఉన్నట్లు కోహ్లి అభిప్రాయపడ్డాడు. తమ బలాన్ని పరీక్షించుకునేందుకు విండీస్ పర్యటన చాలా చక్కగా ఉపయోగపడిందన్న కోహ్లి.. ఈ సిరీస్లో స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ వృద్థిమాన్ సాహాలు బ్యాటింగ్లో రాణించడం జట్టుకు సానుకూలాంశమన్నాడు.
'లోయర్ ఆర్డర్లో వచ్చి నిలదొక్కుకోవాలంటే కష్ట సాధ్యం. అయితే ఆ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చిన సాహా, అశ్విన్లు చక్కగా ఆకట్టుకున్నారు. మూడో టెస్టులో భారత కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరు సెంచరీలతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇది మాకు అతి పెద్ద సానుకూలాంశం అనడంలో ఎటువంటి సందేహం లేదు. టెస్టు క్రికెట్లో నిలకడ అనేది ప్రధానం. అది మా జట్టు ప్రదర్శనలో పూర్తిగా కనబడింది. ఈ సిరీస్లో విండీస్ కూడా మెరుగైన ప్రదర్శన చేసింది'అని కోహ్లి తెలిపాడు.కాగా, విండీస్ చివరి టెస్టు వర్షం కారణంగా డ్రా ముగియడంతో భారత్ తన నంబర్ వన్ ర్యాంకును కోల్పోయింది. దీనిపై విరాట్ బదులిస్తూ.. తాము ర్యాంకింగ్స్ కోసం ఆడటం లేదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నాడు.