‘రోహిత్‌.. ఏమైంది నీ అనుభవం?’ | Sakshi
Sakshi News home page

రివ్యూ తీసుకోలేదు.. వికెట్‌ సమర్పించుకున్నాడు!

Published Sat, Mar 30 2019 5:13 PM

Replays show that the Rohit dismissal missing leg on HawkEye - Sakshi

మొహాలి: ప్రపంచ క్రికెట్‌లో అంపైర్ల తప్పిదాల వల్ల ఎల్బీ రూపంలో క్రికెటర్లు వికెట్లు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా రోహిత్‌ శర్మ సైతం అంపైర్‌ తప్పిదం కారణంగా వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా శనివారం కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(32) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కింగ్స్‌ బౌలర్‌ విల్జోయిన్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌ ఎల్బీగా ఔటయ్యాడు. రోహిత్‌ ప్యాడ్లకు తాకిన బంతికి కింగ్స్‌ పంజాబ్‌ అప్పీల్‌ చేయగా, అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. అది ఔట్‌గా భావించిన రోహిత్‌ పెవిలియన్‌ చేరాడు. అయితే రిప్లేలో అది ఔట్‌ కానుట్లు తేలింది. ఆ బంతి లెగ్‌ స్టంప్‌ పైనుంచి వెళుతున్నట్లు హాక్‌ఐ టెక్నాలజీ ద్వారా స్పష్టమైంది .

 కాగా, ఇక్కడ రోహిత్‌ రివ్యూ తీసుకోకపోవడంతో వికెట్‌ను సమర్పించుకున్నాడు. రివ్యూ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ రోహిత్‌ ఔట్‌గా భావించి పెవిలియన్‌ చేరడం చర్చనీయాంశమైంది. ఇక్కడ ఫీల్డ్‌ అంపైర్‌ తప్పిదం ఒకటైతే, రోహిత్‌ రివ్యూ తీసుకోకుండా పొరపాటు చేయడం మరొకటి. దాంతో ముంబై ఇండియన్స్‌ కీలక వికెట్‌ను నష్టపోయింది. రోహిత్‌ రివ్యూ తీసుకోకపోవడంపై మాజీ ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అత్యంత అనుభవం గల రోహిత్‌ రివ్యూ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. డీఆర్‌ఎస్‌ వాడుకోవాలన్న ఆలోచన కూడా రాలేదా.. ఇదేనా నీ అనుభవం’అంటూ మురళీ కార్తీక్‌ మండిపడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌.. ముందుగా ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

Advertisement
Advertisement